పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు తీర్పు వెలువరించింది. ఎస్ఈసీ అప్పీల్పై హైకోర్టులో రెండ్రోజుల క్రితం వాదనలు ముగియగా, జడ్జిమెంట్ రిజర్వ్ చేసిన హైకోర్టు ఇవాళ తీర్పు ప్రకటించింది. ఇబ్బంది లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఎస్ఈసీ వేసిన రిట్ అప్పీల్ పిటిషన్ను హైకోర్టు అనుమతించింది. వ్యాక్సినేషన్కు ఎన్నికలు అడ్డుకాదని ఎస్ఈసీ తరపు న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించగా.. కొవిడ్ వ్యాక్సినేషన్ వల్ల ఎన్నికలు నిర్వహించలేమని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టుకు వెల్లడించిన విషయం తెలిసిందే.
షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు ..
హైకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారమే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సృష్టం చేశారు. త్వరలో సీఎస్, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియకు సహకరిస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపిందని ఎస్ఈసీ వెల్లడించారు. వచ్చే నెల 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు.













