రాజధానిపై వైసీపీకి తప్పని వెయిటింగ్, స్టేటస్కో ఆదేశాలు..
రాష్ట్ర గవర్నర్ వికేంద్రీకరణకు వీలుగా 3 రాజధానులు, సిఆర్డీఎ రద్దు బిల్లులు ఆమోదించిన దగ్గర్నుంచీ ఎప్పుడెప్పుడు రాజధాని తరలింపు ప్రక్రియ ప్రారంభిద్దామని ఉవ్విళ్లూరుతున్న ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ సర్కార్ ఉత్సాహం మీద హైకోర్టు మరోసారి నీళ్లు చల్లింది. తొలిసారి రాజధాని తరలింపుకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు..యధా తధ స్థితిని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసిన విషయం తెలిసిందే.
తదనుగుణంగానే శుక్రవారం మరోసారి హైకోర్టు ఈ అంశంపై విచారణ చేపట్టింది. ఇప్పటికే ఈ విచారణ ప్రక్రియ మొదలవడానికి ముందుగానే ప్రభుత్వం తమ తరపు నుంచి అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. రాజధానుల ప్రక్రియ రాష్ట్ర పరిధిలోని దంటూ ఆ అఫిడవిట్లో పేర్కొంది. ఈ నేపధ్యంలో శుక్రవారం రెండోసారి పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు మళ్లీ స్టేటస్ కో ఆర్డర్కే మొగ్గు చూపింది. స్టేటస్ కో ఎత్తివేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. రాజధానిపై యధా తధ స్థితి కొనసాగించాలని మరోసారి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.













