అగ్రరాజ్యం భారీ విరాళం!
పేద దేశాల్లోని ప్రజలకు కొవిడ్ టీకాను అందించేందుకు అగ్రరాజ్యం అమెరికా భారీ విరాళాన్ని ప్రకటించనుంది. కరోనా కట్టడికి నాలుగు బిలియన్ డాలర్లను విరాళంగా అందించనుంది. జీ7 దేశాల భేటీ సందర్భంగా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ప్రకటన చేస్తారని శ్వేతసౌధం వెల్లడించింది. ఈ నిధులను 2022 చివరి వరకు విడతల వారీగా విడుదల చేయనున్నట్లు శ్వేతసౌధం అధికారులు స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన కొవాక్స్ కార్యక్రమంలో జీ7 సభ్యదేశాలు క్రియాశీలకంగా పాల్గొనాలని బైడెన్ కోరనున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు కొవిడ్ టీకా అందేలా కృషి చేయడానికి అమెరికా కట్టుబడి ఉందని శ్వేతసౌధం ఒక ప్రకటనలో తెలిపింది. జీ7లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, కెనడా, ఇటలీ, జర్మనీ సభ్యదేశాలుగా ఉన్నాయి.













