జులై నాటికి ప్రతి ఒక్క అమెరికన్ కు టీకా

కరోనా మహమ్మారి నుంచి తమ దేశ ప్రజలకు త్వరలోనే రక్షణ కల్పించగలమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విశ్వాసం వ్యక్తం చేశారు. జులై నెలాఖరులోగా దేశంలో 600 మిలియన్ డోసుల కొవిడ్ టీకా అందుబాటులోకి రానుందని ఆయన తెలిపారు. మోడెర్నా, ఫైజర్ ఫార్మా సంస్థలు చెరో 300 మిలియన్ డోసుల కొవిడ్ టీకాను సరఫరా చేస్తాయని ఆయన తెలిపారు. ప్రతి ఒక్క అమెరికన్కూ టీకా అందజేసేందుకు ఇవి సరిపోతాయని ఆయన వివరించారు. అంతేకాకుండా తమ విద్యార్థులు పాఠశాలలకు, విద్యా సంస్థలకు వెళ్లాలని తాను ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు. అందుకుగాను ఉపాధ్యాయులకు వీలైనంత త్వరగా వ్యాక్సిన్లు అందజేయటాన్ని తాను సమర్థిస్తున్నాన్నారు. టీకా పంపిణీలో అధికారులు వారికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. దేశంలో పరిస్థితులు ఎప్పుడు సాధారణ స్థితికి చేరుకుంటాయనే ప్రశ్నకు జవాబుగా రానున్న క్రిస్మస్ కల్లా పరిస్థితి మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మాస్కు ధరించి, సామాజిక దూరం పాటించాల్సిన అవసరం అప్పటికీ చాలా తక్కువ ఉండొచ్చని ఆయన అంచనా వేశారు.