రోజుకు 10 లక్షల మందికి టీకాలు వేయగలం : ఫౌచీ

అమెరికాలో త్వరలో రోజుకు 10 లక్షల మందికి కరోనా వైరస్ టీకాలు అందజేయగలమని ఆ దేశ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ అంచనా వేశారు. అక్కడ కొన్ని వారాల క్రితం ఫైజర్, మోడెర్నా టీకాలకు ఆమోదం లభించి టీకా కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అది నెమ్మదిగా నడుస్తుండటంపై ప్రజలు, వైద్యాధికారులు నిరాశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాము త్వరలోనే వేగం పుంజుకుంటామంటూ ఫౌచీ వెల్లడించారు. అంతేకాకుండా వైరస్ విజృంభణ కొనసాగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరించారు.
ఎప్పుడైనా భారీ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు, అవాంతరాలు ఉంటూనే ఉంటాయి. టీకా కార్యక్రమం వేగం పుంజుకుంది. రోజుకు ఐదు లక్షల మందికి టీకా అందుతోంది. ఈ కార్యక్రమం ఇంకా ఊపందుకున్న తరవాత రోజుకు 10 లక్షలు అంతకంటే ఎక్కువ మందికే టీకాలు అందిస్తామని అంచనా వేస్తున్నాను. కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ మొదటి 100 రోజుల్లో 100 మిలియన్ల టీకాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది చాలా వాస్తవికమైన లక్ష్యం అని ఫౌచీ అభిప్రాయపడ్డారు. అలాగే దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ సాధించాలంటే 70 నుంచి 85 శాతం మంది అమెరికన్లకు టీకాలు వేయాల్సి ఉంటుందని వెల్లడించారు.