ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత కాస్త తగ్గుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 71,806 నమూనాలను పరీక్షించగా 6,133 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,93,484కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 48 మంది కరోనాతో మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో 8 మంది, ప్రకాశం 6, తూర్పు గోదావరి 5, కృష్ణా 5, విశాఖపట్నం 5, అనంతపురం 4, గుంటూరు 4, పశ్చిమగోదావరి 4, కడప 3, కర్నూలు 2, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 5,828కి చేరింది. 2 4 గంటల వ్యవధిలో 7,075 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకోగా, ప్రస్తుతం 58,445 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 58,06,558 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్లో పేర్కొంది.






