ఉమ్మడి కుటుంబం ఉసురు తీసిన కరోనా.. రూ.1.30 కోట్లు ఖర్చు చేసిన దక్కని ప్రాణాలు
ఉమ్మడి కుటుంబం. ముగ్గురు కుమారులు, కోడళ్లు, పిల్లలతో ఒకటే సందడి. మొత్తంగా ఆనందానికి ఆ ఇల్లు చిరునామాగా ఉండేది. కరనా రూపంలో ఆ కుటుంబంలో ఒక్కసారిగా చీకటి అలుముకుంది. ఇంటిల్లిపాదిపై దాడి చేసిన వైరస్ మొదటి ఇంటి పెద్ద దిక్కును బలితీసుకుంది. రోజుల వ్యవధిలో ఇద్దరి కుమారులనూ చంపేసింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలానికి చెందిన చకినారపు భూమయ్య(70)కు నలుగురు కుమారులు. మూడో కుమారుడు శరణ్కుమార్ 20 ఏళ్ల కిందటే చనిపోయారు. మిగిలిన కుమారులతో కలిసి ఆయన జిల్లా కేంద్రంలో నక్షత్ర ఇంజనీరింగ్ పేరుతో దుకాణం నిర్వహిస్తున్నారు. కుమారులందరికీ వివాహాలయ్యారు. అందరూ జిల్లా కేంద్రంలోనే సొంతింట్లో ఉమ్మడిగా నివసిస్తున్నారు.
గత నెలలో భూమయ్యతోపాటు రెండో కుమారుడు కిరణ్కుమార్ (45), అదే కుటుంబానికి చెందిన చిన్నారులకు కరోనా సోకింది. తండ్రీకొడుకులు హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. చిన్నారులు ఇంట్లో ఐసొలేషన్లో ఉండి కోలుకోగా, భూమయ్య చికిత్స పొందుతూ ఆగస్టు 22న చనిపోయారు. తర్వాత మరో కుమారుడు కిషోర్కుమార్ (43)కు కరోనా సొకింది. తొలుత ఇంట్లోనే చికిత్స పొందిన ఆయన ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్లో తన సోదరుడు చికిత్స పొందుతున్న కార్పొరేట్ ఆసుపత్రిలోనే చేరారు. సెప్టెంబరు 4న ఆసుపత్రిలోనే మరణించారు. ఆ విషాధం నుంచి తేరుకునే లోపే కిరణ్కుమార్ (45) బుధవారం రాత్రి మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు కుప్పకూలారు.
ఇరవై రోజుల వ్యవధిలోనే కుటుంబ పెద్దతోపాటు ఇద్దరు కుమారులు కరోనా కాటుకు బలవడం ఆ కటుంబంలో తీరని వ్యధను మిగిల్చింది. అందరికీ కలిపి వైద్యానికే రూ.కోటి ముప్పై లక్షలు ఖర్చుచేశామని, ఒక్కరి ప్రాణం దక్కుతుందని ఆశపడ్డామని, చివరికీ నిరాశే మిగిలిందని కుటుంబ సభ్యులు కన్నీటీపర్వంతమయ్యారు.






