భారత కంపెనీలకు అమెరికా షాక్!
భారత ఐటీ కంపెనీలకు అమెరికా షాకిచ్చింది. వీసా నిబంధనలను కఠినతరం చేసిన అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సిఐఎస్) తాజాగా పలు ఐటీ సంస్థలను హెచ్1బీ వీసా జాబితా నుంచి తొలగించింది. దీంతో హెచ్ 1బీ వీసాలకు దరఖాస్తు చేసుకునే చాలా భారత ఐటీ కంపెనీలు అర్హతు కోల్పోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అర్హత కోల్పోయిన భారత ఐటీ కంపెనీలు 24 శాతానికి చేరాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమౌతోంది. హెచ్ 1బీ వీసా దరఖాస్తు అర్హత కోల్పోయిన మేజర్ కంపెనీల్లో అజిమెట్రో, బుల్మెన్ కన్సల్టెంట్ గ్రూప్, బిజినెస్ రిపోర్టింగ్ మేనేజ్ మెంట్ సర్వీసెస్, నెటేగ్, కెవిన్ చాంబర్స్, ఈ-ఆస్పైర్ ఐటీ ఎల్ఎల్సిలతో పాటు చిన్న చిన్న కంపెనీలున్నాయి. హెచ్ 1బీ వీసాల దరఖాస్తు అర్హత కోల్పోయిన కంపెనీల వివరాలను అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఆయా సంస్థలకు తెలియజేసింది.
హెచ్ 1బీ వీసాల నిబంధనలను రోజురోజూకు కఠినతరం చేస్తున్న అమెరికా నిపుణులైన వారికి మాత్రమే అర్హత కల్పిస్తోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీసా నిబంధనలు కఠినతరం చేయడంతో 2015తో పోలిస్తే తిరస్కరణకు గురైన హెచ్ 1బీ వీసాలు మూడు రెట్లు పెరిగాయి. మరోవైపు అమెరికాలో హెచ్ 1బీ వీసాపై ఉన్న వారిలో 70శాతం భారతీయులే ఉండటంతో యూఎస్ సీఐఎస్ నిబంధనలు కఠినతరం చేసినట్లు తెలుస్తోంది. వీసా నిబంధనలను మార్చడం వల్లే హెచ్ 1బీ కష్టాలు పెరిగినట్లు ఐటీ నిపుణులు చెబుతున్నారు.













