తానా ఫౌండేషన్ కొత్త కార్యవర్గం… చైర్మన్ గా శశికాంత్ వల్లేపల్లి
ఉత్తర అమెరికా తెలుగు సంఘంలో ముఖ్య విభాగమైన ఫౌండేషన్ కు కొత్త కార్యవర్గం ఎన్నికైంది. ఫౌండేషన్ చైర్మన్ గా శశికాంత్ వల్లేపల్లి, సెక్రటరీగా విద్యాధర్ గారపాటి, ట్రెజరర్ గా వినయ్ మద్దినేని, జాయింట్ ట్రెజరర్ గా కిరణ్ గోగినేని ఎన్నికయ్యారు.
శశికాంత్ వల్లేపల్లి తానాలో మొదటి నుంచి మంచి దాతగా పేరు తెచ్చుకున్నారు. ఎంతోమందికి తానా ద్వారా సహాయాన్ని అందించారు. ఎన్నో ప్రాజెక్టులకు ఆయన ఫండింగ్ కూడా చేస్తున్నారు. 2017 నుంచి తానా ఫౌండేషన్ ట్రస్టీగా, 2021 నుంచి ఫౌండేషన్ సెక్రటరీగా చేయూత స్కాలర్షిప్స్, హెల్దీ హెల్దీ గళ్ హెల్దీ ఫ్యూచర్, ఆయుష్ చైల్డ్ హార్ట్ సర్జరీ వంటి వినూత్న సేవాకార్యక్రమాలతో దూసుకెళుతున్న శశికాంత్ మచ్చలేని వ్యక్తి. అంతకు ముందు 2007 నుండి తానా టీం స్క్వేర్, డిజిటల్ పాఠశాలలు, గ్రంథాలయాలు, కాన్ఫరెన్స్ వంటి పలు కార్యక్రమాలకు గుప్త దానాలు చేస్తూ ఇప్పుడు ది మోస్ట్ ఎలిజిబుల్ తానా ఫౌండేషన్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. అంకితమైన సేవాభావం, అందరితో కలిసిపోయే స్వభావం ఉన్న శశికాంత్ వల్లేపల్లి కాంత్ ఫౌండేషన్ ద్వారా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఆయన చేసిన సహాయం మరచిపోలేనిది. తానా ఫౌండేషన్ చేయూత కార్యక్రమానికి కోఆర్డినేటర్గా వేలాది మంది విద్యార్థుల చదువుకు ఆయన సహాయాన్ని అందించారు. తానా ఫౌండేషన్ ట్రజరర్గా కార్యదర్శిగా కూడా శశికాంత్ వల్లేపల్లి పనిచేశారు.
విద్యా గారపాటి తానాలో కమ్యూనిటీకి సహాయం అందించేవారిలో మొదటిలైన్లో ఉండేమనిషి. కమ్యూనిటీకి ఏదైనా సేవ చేయాలన్న సంకల్పంతో తానాలో చేరారు. తానాలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అటు అమెరికాలోనూ, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనివారికి సేవలందిస్తున్నారు. తన సొంత నిధుల నుంచి దాదాపు 75,000,00 డాలర్లను ఆయన ఇంతవరకు సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టారు. అమెరికాలో తానా కాని, నాటా కాని, నాట్స్ లేదా టిటిఎ లాంటి జాతీయ తెలుగు సంఘాలు నిర్వహించే మహాసభలకు వచ్చేవారి దాహాన్ని తీర్చేందుకు లక్షల రూపాయల విలువ చేసే మంచినీటి బాటిళ్ళను అందజేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ తో కలిసి తానా ద్వారా క్యాన్సర్ నిర్దారణ శిబిరాలను నిర్వహించి ఎంతోమందికి చికిత్సకు సహాయాన్ని అందించారు. గతంలో తానా పబ్లిసిటీ కమిటీకి ఛైర్మన్ గా మరియు న్యూజెర్సీ రీజియన్కు రీజనల్ కోఆర్డినేటర్ గా పనిచేశారు.
వినయ్ మద్దినేని తానా ఎగ్జిక్యూటివ్ కమిటీలోనూ, ఇతర కమిటీల్లోనూ పని చేసి అందరి చేత ప్రశంసలు అందుకున్న మనిషి. ప్రస్తుతం ఫౌండేషన్ ట్రస్టీగా ఉన్నారు. మెట్రో అట్లాంటా ప్రాంతంలో చాలా చురుకైన కమ్యూనిటీ నాయకుడు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (తామా)కి అధ్యక్షుడిగా, బోర్డు చైర్ గా కూడా పనిచేశారు. ప్రస్తుతం తానా ఫౌండేషన్ కి ట్రజరర్గా ఆయన ఎన్నికయ్యారు.
కిరణ్ గోగినేని కూడా తానాలో వివిధ పదవులను చేపట్టారు. అట్లాంటాకు చెందిన ఆయన 2019-2021 మధ్య తానా ప్రాంతీయ ప్రతినిధిగా సేవలందించారు. మెట్రో అట్లాంటా తెలుగు సంఘం(తామా), ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా తదితర సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తానా ఫౌండేషన్ సభ్యునిగా ఉన్న ప్రస్తుతం ఫౌండేషన్ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు.







