ఇండో అమెరికన్కు కీలక పదవి!
అమెరికాలో మరో ఇండో- అమెరికన్కు కీలక పదవి దక్కనుంది. భారత సంతతికి చెందిన విజయ్ శంకర్ను దేశ రాజధాని వాషింగ్టన్లోని అత్యున్నత న్యాయస్థానానికి జడ్జిగా నామినేట్ చేయాలనుకుంటున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ నిర్ణయానికి సెనేట్ ఆమోదం లభించిన పక్షంలో విజయ్ శంకర్.. వాషింగ్టన్ డీసీలోని డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా కోర్ట్ ఆఫ్ ఆప్పీల్స్ అసోసియేట్ జడ్జిగా సేవలు అందించనున్నారు. కాగా డ్యూక్ యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా పొందిన విజయ్ శంకర్.. యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా స్కూల్ ఆఫ్ లా నుంచి జ్యూరిస్ డాక్టర్గా పట్టా పుచ్చుకున్నారు. అనంతరం అక్కడే వర్జీనియా లా రివ్వూ నోట్స్ ఎడిటర్గా పనిచేశారు. ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ జడ్జీ చెస్టెర్ జే.స్ట్రాబ్ వద్ద లా క్లర్క్గా ఉన్నారు.
ప్రస్తుతం డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ క్రిమినల్ విభాగంలో సీనియర్ లిటిగేషన్ కౌన్సెల్గా ఉన్న విజయ్ శంకర్ అప్పీలెట్ సెక్షన్ డిప్యూటీ చీఫ్గానూ వ్యవహరిస్తున్నారు. ఇక్కడ చేరడానికి ముందు వాషింగ్టన్లో ఆయన ప్రైవేటు లాయర్గా పని చేశారు. అంతర్జాతీయ స్థాయి లా కంపెనీలైన మేయర్ బ్రౌన్, ఎల్ఎల్సీ కోవింగ్టన్ అండ్ బర్లింగ్, ఎల్ఎల్పీలో పనిచేశారు.













