Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి అడ్వాన్స్ బర్త్ డే గిఫ్ట్, ఈ రోజు విశ్వంభర గ్లింప్స్, 2026 వేసవిలో థియేటర్లలో రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి బర్త్డే ఆగస్టు 22(Megastar Chiranjeevi Birthday 22) దగ్గరపడుతుంటే అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అవుతోంది. ముఖ్యంగా మెగాస్టార్ సోషియో-ఫాంటసీ స్పెక్టకిల్ “విశ్వంభర” కోసం అందరూ ఆసక్తిగా ఎదుచుస్తున్నారు. వశిష్ట డైరెక్ట్ చేస్తున్న యూవీని క్రియేషన్స్ విక్రమ్, వంశీ, ప్రమోద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సందర్బంగా చిరంజీవి ఒక స్పెషల్ వీడియో మెసేజ్ రిలీజ్ చేస్తూ, సినిమాకు సంబంధించిన ఎగ్జైటింగ్ అప్డేట్స్తో పాటు బర్త్డే సర్ప్రైజ్, రిలీజ్ టైమ్లైన్ను అనౌన్స్ చేశారు.
స్పెషల్ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. హాయ్.. ఇలా మీ ముందుకు రావడానికి కారణం విశ్వంభర. చాలా మందికి ఒక డౌట్ ఉంది, ఈ చిత్రం ఎందుకు డిలే అవుతుంది, ఎందుకు ఆలస్యం అవుతుంది అని. ఈ ఆలస్యం, జాప్యం చాలా సముచితమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమా సెకండ్ హాఫ్ మొత్తం విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ మీద ఆధారపడి ఉంది. మీకు అత్యున్నతమైన ప్రమాణాలతోటి బెస్ట్ క్వాలిటీ తోటి అందివ్వాలని దర్శక నిర్మాతల ప్రయత్నమే ఈ జాప్యానికి ప్రధానమైన కారణం. ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా శ్రద్ధ శక్తులతో తీసుకుంటున్న సముచితమైన సమయం ఇది.
ఈ చిత్రం గురించి చెప్పాలంటే ఒక చందమామ కథలా సాగిపోయేటటువంటి అద్భుతమైన కథ. ముఖ్యంగా చిన్నపిల్లలకు మరీ ముఖ్యంగా పెద్దవాళ్లలో ఉండే చిన్న పిల్లలకు సైతం ఇది అలరిస్తుంది. వినోదపరుస్తుంది. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా ఎదురుచూసే మీతో పాటు నాకు కూడా సమాధానంగా యూవి క్రియేషన్స్ వాళ్ళు నా పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందు ఆగస్టు 21న సాయంత్రం 6:06కి ఒక చిన్న గ్లిమ్స్ మనకి అందివ్వబోతున్నారు. అది ఖచ్చితంగా మనల్ని ఆకట్టుకుంటుంది.
అది సరే మరి రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పట్లేదే. అది నేను లీక్ చేస్తున్నాను. చిన్నపిల్లలు, పెద్దవాళ్లలో ఉండే చిన్న పిల్లలు దీన్ని ఎంజాయ్ చేసే సీజన్ సమ్మర్ సీజన్. 2026 వేసవి నాడు ఈ సినిమా మీ ముందు ఉంటుంది. నాది భరోసా. ఎంజాయ్. ఈ చిత్రం చూడండి. ఆస్వాదించండి. విశ్వంభరణం ఆశీర్వదించండి.
ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తయింది. చివరి షెడ్యూల్లో చిరంజీవి, మౌనీ రాయ్ కలిసి చేసిన మాస్ డ్యాన్స్ నెంబర్తో షూట్ ఫినిష్ అయ్యింది. ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండగా.. ఈ ఎనర్జిటిక్ డ్యాన్స్ ట్రాక్ని భీమ్స్ సెసిరోలియో కంపోజ్ చేశారు.
ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష కృష్ణన్ నటిస్తుండగా, ఆశికా రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రలు చేస్తున్నారు. చోటా కె. నాయుడు డీవోపీ, ఏ.ఎస్. ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్.