రాములమ్మ మళ్లీ రానంటోంది…
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్లు తరువాత రీఎంట్రీ ఇచ్చి తానేమిటో నిరూపించుకున్నారు. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో భారతి అనే కాలేజీ ప్రొఫెసర్ రోల్ చేసి, సత్తా చాటారు. ఆమె ట్విట్టర్ వేదికగా సరిలేరు నీకెవ్వరు చిత్రానికి ఘనవిజయం అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తన మొదటి చిత్రం నుండి ఇప్పటి వరకు దశాబ్దాలుగా నటిగా ఆదరిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. వీటితో పాటు మళ్లీ ఆమె ఓ ఆసక్తికర కామెంట్ చేశారు. ప్రజా జీవన పోరాటంలో నా ప్రయాణం మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం కాను కల్పిస్తోందో, లేదో నాకు కూడా తెలియదు. ఇప్పటికి ఇక శెలవు. మనసు నిండిన మీ ఆదరణకు, నా ప్రాణప్రదమైన అభిమాన సైన్యానికి ఎప్పటికి నమస్సులు మీ విజయశాంతి అని భావోద్వేగ ట్వీట్ చేశారు. విజయశాంతి ఇక వరుస సినిమాలు చేస్తారు అని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో ఆమె ఇలాంటి పోస్ట్ పెట్టి అభిమానుల ఆశలపై నీళ్లు చల్లారు.













