తిత్లీ బాధితులకు దర్శకుల సంఘం చేయూత
ఇటీవల ఆంధ్రప్రదేశ్లో సంభవించిన తిత్లీ తుపాన్ ఉత్తరాంధ్ర జిల్లాలను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విపత్తుపై చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు స్పందిస్తూ సీఎం సహాయనిధికి తమ వంతు ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తూ తమ ఉదారతను చాటుకుంటున్నారు. ఇందులో భాగంగా తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం తిత్లీ తపాను సహాయ నిధికి లక్ష రూపాయలు విరాళాన్ని ప్రకటించింది. సోమవారం జరిగిన సర్వసభ సమావేశంలో లక్ష ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్ణయించుకున్నాం. అలాగే అసోసియేషన్ సభ్యులు కొంత మంది వ్యక్తిగతంగా కూడా విరాళాలు ఇస్తామని హామీ ఇచ్చారు. వాటిని కూడా వసూలు చేసి ప్రకటించిన మొత్తంతో కలిపి తిత్లీ తుపాను సహాయనిధికి అందజేస్తామని తెలియజేస్తున్నాం అని దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్, ప్రధాన కార్యదర్శి జి.రామ్ప్రసాద్ తెలిపారు.













