అంతర్జాతీయ మార్కెట్ లోకి ఇరాన్ చమురు…!
అమెరికా-ఇరాన్ చర్చల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఇరాన్ చమురు పరిశ్రమకు.. తీపి కబురు వినిపించింది. ఇరాన్పై విధించిన కఠినమైన ఆంక్షలను తాత్కాలికంగా సడలిస్తూ 60 రోజుల మినహాయింపు ప్రకటించింది. ఆగస్టు 21 వరకు అమల్లో ఉండే ఈ నిర్ణయం ప్రకారం ఇరాన్ నుంచి ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఉత్పత్తి, అమ్మకం, రవాణా, దిగుమతులకు అనుమతి లభించింది. టెహరాన్తో విస్తృత శాంతి ఒప్పందం, అంతర్జాతీయ అణు తనిఖీలను తిరిగి ప్రారంభించే లక్ష్యంతో జరుగుతున్న చర్చల్లో భాగంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఇది ఇరు దేశాల మధ్య నమ్మకాన్ని పెంచే చర్యగా భావిస్తున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారుల్లో ఒకటైన భారత్కు ఈ పరిణామం వ్యూహాత్మకంగా ఎంతో మేలు చేయనుంది. తన మొత్తం చమురు అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడే భారత్, అంతర్జాతీయ ధరల ఒడిదొడుకులకు తీవ్రంగా ప్రభావితమవుతుంది. ముడి చమురు ధరల్లో ఏ చిన్న పెరుగుదలైనా దేశ దిగుమతి బిల్లు, ద్రవ్యోల్బణం, ఇంధన ధరలపై పెను ప్రభావాన్ని చూపుతుంది.
గత నాలుగేళ్లలో భారత్ చమురు దిగుమతుల సరళిలో భారీ మార్పులు వచ్చాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్ రాయితీపై లభించే రష్యన్ ముడి చమురుకు అతిపెద్ద కొనుగోలుదారుగా అవతరించింది. ప్రస్తుతం మన దేశ మొత్తం దిగుమతుల్లో రష్యా వాటా దాదాపు 30-40 శాతంగా ఉంది. అదే సమయంలో సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలపై కూడా భారత్ అధికంగా ఆధారపడి ఉంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారీ, ఈ ఏకపక్ష ధోరణి వల్ల సరఫరాకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఇరాన్ తిరిగి మార్కెట్లోకి వస్తే, భారత్కు మరో కీలకమైన, నమ్మకమైన చమురు వనరు అందుబాటులోకి వస్తుంది.
భారత్-ఇరాన్ చమురు బంధం
2018లో అమెరికా ఆంక్షలను తిరిగి విధించక ముందు, ఇరాన్ భారత్కు అతిపెద్ద చమురు సరఫరాదారులలో ఒకటిగా ఉండేది. పోటీ ధర, అనుకూలమైన రుణ నిబంధనలు, తక్కువ రవాణా ఖర్చులు వంటి కారణాలతో భారత రిఫైనరీలు ఇరాన్ చమురుకు ప్రాధాన్యత ఇచ్చేవి. కానీ ఆంక్షల వల్ల ఇరాన్ నుంచి దిగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పుడు లభించిన ఈ తాత్కాలిక అవకాశంతో భారత రిఫైనరీలు, ఇరాన్ సరఫరాదారుల మధ్య మళ్లీ చర్చలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుత మినహాయింపు కేవలం 60 రోజులు మాత్రమే కావడంతో, భారత రిఫైనరీలు తక్షణమే భారీ కొనుగోళ్లకు సిద్ధపడకపోవచ్చు. దీర్ఘకాలిక స్పష్టత లభిస్తేనే వారు ఒప్పందాలు చేసుకుంటారు. అయితే, చర్చలు సఫలమైతే ఇరాన్ చమురు క్రమంగా మార్కెట్లోకి వస్తుందనే సంకేతాలు వెలువడ్డాయి. దీనివల్ల ప్రపంచ మార్కెట్లో చమురు సరఫరా పెరిగి ధరలు నియంత్రణలోకి వస్తాయి. భారత్ నేరుగా ఇరాన్ నుంచి కొనుగోలు చేయకపోయినా, ప్రపంచవ్యాప్తంగా ధరలు తగ్గితే అది మన దేశానికి పరోక్షంగా లాభమే అని చెప్పవచ్చు.
మరోవైపు హర్మూజ్ జలసంధి అంశం కూడా భారత్కు చాలా ముఖ్యం. మన దేశానికి వచ్చే చమురులో అత్యధిక భాగం ఈ జలసంధి ద్వారానే ప్రయాణిస్తుంది. అమెరికా-ఇరాన్ ఒప్పందంలో ఈ మార్గంలో నౌకల స్వేచ్ఛా రవాణాకు భరోసా లభించడం భారత్కు ఎంతో సానుకూల అంశం.








