జిన్పింగ్ తో భేటీ తర్వాత.. బైడెన్ మళ్లీ అదే మాట!
చైనా, అమెరికా మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వెళ్ల షీ జిన్పింగ్, జో బైడెన్ తాజాగా ముఖాముఖీగా సమావేశమయ్యారు. ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార మండలి శిఖరాగ్ర సదస్సు నిమిత్తం ఆరేళ్ల తర్వాత అమెరికాలో అడుగు పెట్టారు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్. ఈ క్రమంలోనే బైడెన్తో ఆయన ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం ముగిసిన కొద్దిసేపటికే బైడెన్ మీడియా కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిన్పింగ్ మీరు ఇంకా నియంతగానే భావిస్తున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా, దీనికి బైడెన్ బదులిస్తూ అవును. ఆయన నియంతే. ఆయన కమ్యూనిస్ట్ దేశాన్ని పాలిస్తున్నారు. ఆ ప్రభుత్వం మనకంటే భిన్నమైంది అని వ్యాఖ్యానించారు. ఏదేమైనప్పటికీ తాము చర్చల్లో పురోగతి సాధించామని తెలిపారు.
అయితే బైడెన్ వ్యాఖ్యలు బీజింగ్ను మరోసారి అసహనానికి గురి చేసేలా కన్పిస్తున్నాయి. ఈ ఏడాది జూన్లోనూ బైడెన్ ఇలాగే జిన్పింగ్ను నియంతగా పేర్కొన్నారు. అప్పుడు అగ్రరాజ్య అధినేత తీరును చైనా తీవ్రంగా తప్పుబట్టింది. ఆయన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని మండిపడిరది. ఇప్పుడు జిన్పింగ్తో భేటీ తర్వాత కూడా బైడెన్ మరోసారి ఇలా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. ఇరు దేశాల సంబంధాలను మెరుగుపర్చుకునేలా నేతలిద్దరి మధ్య ఫలప్రదమైన చర్చలు జరిగాయని వైట్హౌస్ ప్రకటించింది.. ఆ కాసేపటికే బైడెన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.






