రేవంత్ గురించి ఏం మాట్లాడొద్దు : చంద్రబాబు
లేక్వ్యూ గెస్ట్హౌస్లో చంద్రబాబుతో టీ.టీడీపీ నేతల భేటీ ముగిసింది. తెలంగాణ టీడీపీలో వారం రోజులుగా జరుగుతున్న రేవంత్ రెడ్డి వ్యవహారంపై ప్రధానంగా చర్చించారు. రేపు మరోసారి విజయవాడలో భేటీ కావాలని నిర్ణయించారు.
కాగా తెలంగాణ టీడీపీ నేతలతో పాటు రేవంత్ రెడ్డి రేపు (శనివారం) అమరావతిలో చంద్రబాబుతో మరోసారి సమావేశం కానున్నారు. రేపు ఉదయం పది గంటలకు అందరూ హాజరు కావాలని చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది.
అంతకు ముందు హైదరాబాద్ లేక్వ్యూ గెస్ట్హౌస్లో చంద్రబాబుతో జరిగిన తెలంగాణ టీడీపీ నేతల సమావేశానికి పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణతో పాటు రేవంత్రెడ్డి కూడా హాజరయ్యారు. అలాగే చంద్రబాబుతో జరిగిన ఈ భేటీలో పార్టీలోని ప్రతి ఒక్కరు వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పాలనుకున్నారు. అయితే సమయం లేనందున రేపు అమరావతిలో మరోసారి భేటీ కావాలని అధినేత ఆదేశించినట్లు పార్టీ నేత రావుల చంద్రశేఖర్ తెలిపారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై చర్చించామని, రేపటి సమావేశంలో అన్ని అంశాలను చర్చకు వస్తాయని తెలిపారు.
శుక్రవారం లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణ అసెంబ్లీకి హాజరై.. రేవంత్రెడ్డి కొద్దిసేపు ఆలస్యంగా వచ్చారు. ఒక్కొక్కరి నుంచి అభిప్రాయాలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని చంద్రబాబు నిర్ణయించారు. దాంతో అందరూ అమరావతికి రావాలని ఆదేశించారు. తొందరపడి ఎవరూ ఏం మాట్లాడవద్దని హెచ్చరికలు జారీ చేశారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, రావుల చంద్రశేఖర్రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, ఆర్. కృష్ణయ్య, సీతక్క, ఉమా మాధవరెడ్డితో సహా కీలక నేతలంతా ఈ సమావేశానికి హాజరైనారు. రేవంత్, చంద్రబాబుతో కొద్దిసేపు ఏకాంతంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని పరిస్థితులను రేవంత్, బాబు వద్ద ప్రస్తావించినట్లు సమాచారం.













