సెప్టెంబరు నెలకల్లా కరోనా తగ్గుముఖం: తెలంగాణ
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుతూ వస్తోందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డా.శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. ప్రస్తుతం రోజుకు 23వేల పరీక్షలు చేస్తున్నామన్నారు. కరోనా కట్టడికి మరో రూ.100 కోట్లు కేటాయించామన్నారు.
హైదరాబాద్, జిహెచ్ ఎంసి పరిధిలో కరోనా కేసుల సంఖ్య తగ్గిందని రంగారెడ్డి తదితర జిల్లాల్లో కొద్దిగా పెరిగిందన్నారు. విలువైన మందులు జిల్లా స్థాయిలో కూడా అందుబాటులోకి తెచ్చామని, ఆక్సిజన్ పడకలు పెద్ద సంఖ్యలోనే అందుబాటులో ఉన్నాయన్నారు. తెలంగాణలో రికవరీ రేటు కూడా బాగా పెరుగుతోందని, మరణాల సంఖ్య తగ్గుతోందని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన కట్టుదిట్టమైన చర్యల కారణంగా తెలంగాణలో సెప్టెంబరు నాటికి కరోనా తగ్గు ముఖం పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.













