ఓవైసీ విద్యాసంస్థల వివాదం.. చర్యలు తప్పవా..?
తెలంగాణలో ఓవైసీల నేతృత్వంలోని ఫాతిమా విద్యాసంస్థల భూముల వ్యవహారం మరోసారి రాజకీయంగా, న్యాయపరంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం, కోర్టుల అక్షింతలు, అధికార-విపక్షాల మధ్య సవాల్-ప్రతిసవాళ్లతో ఈ అంశం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేయగా, ఈ వ్యవహారం కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల మధ్య పదునైన విమర్శల యుద్ధానికి దారితీసింది.
ఫాతిమా విద్యాసంస్థల ఉల్లంఘనలపై విచారణ సందర్భంగా ప్రభుత్వ విభాగాలు కోర్టుకు సమర్పించిన నివేదికలు, చెప్పిన సమాధానాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తాము ఈ సంస్థలకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని హైకోర్టుకు స్పష్టం చేసింది. తాము ప్రస్తుతం సర్వే వ్యవహారాల్లో బిజీగా ఉన్నామంటూ కాలయాపన సమాధానం ఇచ్చింది. నివేదిక ఇచ్చేందుకు కొంత గడువు కావాలని కోరింది. చెరువులు, నాలాల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా.. ఇతర శాఖల నుంచి స్పష్టమైన నివేదికలు వస్తేనే తాము తదుపరి చర్యలు తీసుకోగలమని వివరించింది. ఒకరిపై ఒకరు నెపం నెట్టేస్తూ, బాధ్యతల నుంచి తప్పుకునేలా ఉన్న ప్రభుత్వ శాఖల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులు ఇన్నిసార్లు చీవాట్లు పెడుతున్నా, క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని న్యాయస్థానం నిలదీసింది.
హైకోర్టు వ్యాఖ్యలను అస్త్రంగా చేసుకుని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచాయి. ముఖ్యంగా బీజేపీ ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అక్రమ కట్టడాలపై బుల్డోజర్లు నడుపుతామని చెప్తున్న హైడ్రా, ఫాతిమా విద్యాసంస్థల జోలికి ఎందుకు వెళ్లడం లేదని బీజేపీ ప్రశ్నిస్తోంది. కేంద్రమంత్రి బండి సంజయ్ ఈ వివాదంపై అత్యంత ఘాటుగా స్పందించారు. తాము అధికారంలోకి వస్తే ఓవైసీ విద్యాసంస్థలను కూల్చేస్తామని బహిరంగంగా ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి.
దీనికి ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ అంతే దీటుగా కౌంటర్ ఇచ్చారు. “ఒక విద్యాసంస్థను కూల్చితే.. వంద విద్యాసంస్థలను కడతాం” అంటూ సవాల్ విసిరారు. తమ విద్యాసంస్థలను, మైనారిటీల హక్కులను ఎలా కాపాడుకోవాలో తమకు బాగా తెలుసంటూ ఆయన స్పష్టం చేశారు.
అక్బరుద్దీన్ ఓవైసీ కామెంట్స్ పై మరో కేంద్రమంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓవైసీ సోదరులు బహిరంగంగా ప్రభుత్వాన్ని, చట్టాన్ని బెదిరిస్తున్నా రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు వెనకడుగు వేస్తోందని ఆయన ప్రశ్నించారు. ఓవైసీ అంటే రేవంత్ రెడ్డికి అంత భయమా అని నిలదీశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎం అక్రమాలను చూసీచూడనట్లు వదిలేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఫాతిమా విద్యాసంస్థల వ్యవహారం కేవలం ఒక భూ వివాదంగానే కాకుండా, తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా మారింది. ఒకవైపు హైడ్రా యాక్షన్తో దూసుకుపోతున్నట్లు కనిపిస్తున్నా, ఎంఐఎం నేతలకు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం వెనకడుగు వేస్తోందనే ఇంప్రెషన్ ప్రజల్లో బలంగా కనిపిస్తోంది. ప్రభుత్వ విభాగాలు కోర్టులో పొంతన లేని సమాధానాలు చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా సామర్థ్యంపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ గ్యాప్ను వాడుకుని తెలంగాణలో తామే ప్రధాన ప్రత్యామ్నాయం అని నిరూపించుకునేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కోర్టు తదుపరి ఆదేశాలు ఎలా ఉండబోతున్నాయి? హైడ్రా నిజంగానే చర్యలకు ఉపక్రమిస్తుందా? లేదా ప్రభుత్వ శాఖల మధ్య ఫైళ్ల కదలికల పేరుతో కాలయాపన జరుగుతుందా? అన్నది ఇప్పుడు సస్పెన్స్గా మారింది.








