గులాబీ తోటకు మల్లారెడ్డి వీడ్కోలు?
తనదైన డైలాగులు, విలక్షణమైన రాజకీయ శైలితో నిత్యం సోషల్ మీడియాలో, ప్రజల్లో హల్చల్ చేసే మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. తాజాగా ఓ కార్యకర్త జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయన, “BRSకు దూరమయ్యానని నన్ను మర్చిపోతున్నారు” అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీకి ఆయన గుడ్ బై చెప్పి, త్వరలోనే భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్న తరుణంలో ఈ కామెంట్స్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ అగ్రనేతల వద్ద అత్యంత కీలక వ్యక్తిగా, పార్టీకి ప్రధాన బలంగా నిలిచిన మల్లారెడ్డి, అధికారం కోల్పోయిన తర్వాత కూడా చాలాకాలంపాటు ఆయన పార్టీలో చురుగ్గా ఉండేవారు. కానీ కొంతకాలంగా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన పార్టీ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్ వైపు రావడం పూర్తిగా తగ్గించేశారు. కేటీఆర్, హరీశ్ రావు వంటి పార్టీ ముఖ్య నేతలు నిర్వహించే ప్రెస్ మీట్లు, కీలక సమావేశాల్లోనూ మల్లారెడ్డి మునుపటిలా యాక్టివ్గా కనిపించడం లేదు. కాంగ్రెస్, బీజేపీ, చివరికి టీడీపీలో చేరేందుకు కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం చాలా రోజులుగా నడుస్తోంది. తాజాగా “నేను బీఆర్ఎస్కు దూరమయ్యానని నన్ను దూరం పెడుతున్నారు” అంటూ నేరుగా కార్యకర్తల సమక్షంలో వ్యాఖ్యానించడం.. ఆయన పార్టీ మారడం ఖాయమనే సంకేతాలను ఇస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మల్లారెడ్డి కుటుంబం బీజేపీ వైపు చూస్తోందనడానికి మరో ప్రధాన కారణం.. ఆయన కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి ఇటీవల చేసిన కొన్ని ఆసక్తికర కామెంట్స్ కూడా ఉన్నాయి. ఆమె ఓ ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించడం పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. అంతేకాకుండా, ఆమె బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి అక్కడ ఆ పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ సహా కీలక నేతలతో భేటీ కావడం చర్చకు దారితీసింది. అయితే, ఇది కేవలం డిజిటల్ ఇండియా ఈవెంట్ గురించిన భేటీ అని, రాజకీయ ప్రాధాన్యత లేదని ఆమె వివరణ ఇచ్చినప్పటికీ ఊహాగానాలు మాత్రం ఆగలేదు.
ప్రస్తుతం మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇద్దరూ బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. అయితే, భవిష్యత్తులో రాబోయే మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో ఉంచుకుని మల్లారెడ్డి ఫ్యామిలీ ఒక పెద్ద స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. తమ కుటుంబానికి రాబోయే రోజుల్లో ఒక పార్లమెంటు నియోజకవర్గంతో పాటు అందులోని నాలుగు అసెంబ్లీ టికెట్లు కేటాయించాలనే షరతుపై అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ అధిష్టానాల నుంచి గట్టి హామీ పొందే ప్రయత్నాల్లో మల్లారెడ్డి ఫ్యామిలీ ఉన్నట్లు పొలిటికల్ కారిడార్లో గట్టిగా వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డి అత్యంత వ్యూహాత్మకంగా “నన్ను మర్చిపోతున్నారు” అంటూ సానుభూతి కార్డ్ ప్లే చేశారా? లేక నిజంగానే బీఆర్ఎస్ శ్రేణులు తనను దూరం పెట్టడం వల్లే ఆవేదనతో అన్నారా? అనేది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా, మల్లారెడ్డి తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తెరలేపబోతున్నాయనేది మాత్రం స్పష్టమవుతోంది.








