షోలమ్ గ్రూప్ గ్లోబల్ ఆపరేషన్స్ ఆఫీసర్ జీగాబ్ హాతో మంత్రి లోకేష్ సమావేశం
శ్రీసిటీ యూనిట్ నిర్మాణం త్వరగా పూర్తిచేయండి
సియోల్ (సౌత్ కొరియా): దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ షెల్ఫ్ లేబుల్స్ (ESL), ఐఓటీ & పవర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ సోలమ్ (SOLUM) గ్రూప్ గ్లోబల్ ఆపరేషన్స్ ఆఫీసర్ జీగాబ్ హా (Mr. Jeagab Ha)తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఏపీలోని శ్రీసిటీలో రూ.338కోట్లతో సోలమ్ సంస్థ ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ యూనిట్ నిర్మిస్తున్నందుకు ధన్యవాదాలు చెబుతూ…త్వరగా శ్రీసిటీ యూనిట్ నిర్మాణ పనులు పూర్తిచేసి, ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు. CSOT (TCL)కి తిరుపతి నుండి డిస్ప్లే అసెంబ్లీ ఫెసిలిటీ ఉన్నందున, ఎలక్ట్రానిక్ షెల్ఫ్ లేబుల్స్, ఇతర డిస్ప్లే సంబంధిత ఉత్పత్తుల తయారీని శ్రీసిటీ యూనిట్ లో చేపట్టి కార్యకలాపాలను విస్తరించాలని సోలమ్ సంస్థ సీఈవోకు విజ్ఞప్తి చేశారు. సోలమ్ గ్రూప్ గ్లోబల్ ఆపరేషన్స్ ఆఫీసర్ జీగాబ్ హా మాట్లాడుతూ… సోలమ్ ఇండియా హైటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నోయిడా (యూపీ)లో పీబీబీఏ (PBBA) తయారీ కేంద్రం, శ్రీసిటీలో కొత్త ప్లాంట్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. సోలమ్ సంస్థ 16 దేశాల్లో తమ కార్యకలాపాలను విస్తరించి సరఫరా, విక్రయ నెట్వర్క్ కలిగి ఉందని, Vusion Group, E Ink, Panasonic వంటి సంస్థలతో పాటు ప్రపంచ ESL రంగంలో అగ్రశ్రేణిలో నిలుస్తోందని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా శ్రీసిటీ యూనిట్ నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.








