తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించాలి : పవన్ కల్యాణ్
తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరమని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందేనన్నారు. జీవితం విలువైనది.. ఫలితాలతో నిరాశ చెంది ఆత్మహత్యలకు పాల్పడొద్దు అని విద్యార్థులకు సూచిస్తూ పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులకు అండగా జనసేన నిలుస్తుందన్నారు. చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేసి తగిన పరిహారం ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు. ఇన్ని తప్పిదాలకు కారణమైన బోర్డు అధికారులు, సాఫ్ట్ వేర్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు న్యాయ విచారణకు ఆదేశించాలని అన్నారు.













