18 మంది టీఆర్ఎస్ ముఖ్యనేతలపై…. లీగల్ ఒపీనియన్

అమర వీరుల ఆశయ సాధనకు విరుద్ధంగా తెలంగాణలో కేసీఆర్ పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాలే లబ్ధి పొందాయని ఆరోపించారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి వివరాలను పూర్తి సేకరించాం. ఇప్పటికే టీఆర్ఎస్కు సంబంధించిన 18 మంది ముఖ్య నేతలపై లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం. మా ఉద్యమ పంథానే వేరుగా ఉంటుంది. సీఎం కేసీఆర్ సహారా, ఈఎస్ఐ కేసుల వివరాలు పూర్తిగా తీస్తున్నాం. వారం రోజులుగా సీఎం కేసీఆర్ కేసుల పైనే ఆరా తీస్తున్నాం. ఈ స్కాంలు చూశాకే సీఎం కేసీఆర్ ఎంత పెద్ద అవినీతిపరుడో తేలిపోయిందని అన్నారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ వారం రోజుల్లో బీజేపీలో చేరే అవకాశం ఉందని అన్నారు. ఆయన ఎమ్మెల్యే పదవికి, పార్టీకీ రాజీనామా చేయడానికి న్యాయపరమైన సలహా తీసుకుంటున్నారని చెప్పారు. ఎలాంటి హామీ లేకుండానే ఈటల బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు. బీజేపీలో ఎవరు చేరినా, ఎలాంటి హామీ ఉండదన్నారు. పార్టీ సిద్ధాంతాలతో పాటు ప్రధాని పాలన నచ్చి ఈటల బీజేపీలో చేరుతున్నారన్నారు. తెలంగాణ ఉద్యమకారులు బీజేపీని మంచి వేదికగా భావిస్తున్నారని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ను వ్యతిరేకించే వారికి బీజేపీ అండగా ఉండి పోరాటం చేస్తుంది అని పేర్కొన్నారు.