హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు వెళ్తాం
పంచాయతీ రిజర్వేషన్ల మీద హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. పంచాయతీల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్కు కట్టుబడి ఉన్నామని సృష్టం చేశారు. తెలంగాణలో మొత్తం 61 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన అనుమతి ఉత్తర్వులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మొత్తం 61 శాతం రిజర్వేషన్ల అమలు అవసరాన్ని సుప్రీంకోర్టుకు వివరిస్తామని తెలిపారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్పై కాంగ్రెస్ హైకోర్టులో పిటిషన్ వేయించిందని, కాంగ్రెస్ పార్టీ బీసీల రిజర్వేషన్లకు గండి కొట్టిందని కేసీఆర్ మండిపడ్డారు.
పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కల్పించే రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని తెలంగాణ సర్కారుకు హైకోర్టు సృష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ రమేశ్ రంగనాథ్తో కూడిన ధర్మాసనం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఏజెన్సీ ప్రాంతాల్లోని ఎస్టీ రిజర్వేషన్లకు మాత్రం మినహాయింపు ఉంటుందని సృష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.













