చెన్నమనేనికి హైకోర్టులో ఊరట
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్కు హైకోర్టులో వూరట లభించింది. తన పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులను తాత్కాలికంగా కోర్టు నిలిపివేసింది. పౌరసత్వం రద్దుపై పునసమీక్షించాలని కేంద్రహోంశాఖను రమేశ్ కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థనపై ఆరు వారాల్లోగా తేల్చాలని హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. చెన్నమనేని రమేష్ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ గత మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు జర్మనీ పౌరసత్వం ఉందని హోంశాఖ సంయుక్త కార్యదర్శి నిర్ధారించారు. దీనిపై ఎమ్మెల్యే హైకోర్టును ఆశ్రయించారు. పౌరసత్వం రద్దుపై నిర్ణయాన్ని వెలువరించే ముందు తన వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.













