అక్టోబర్ 17 నుంచి పూలపండుగ
ఈ నెల 17న ఎంగిలి పూల బతుకమ్మ ఆడుకోవాలని, ఇందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి గౌరవాధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, రాష్ట్ర పురోహిత సంఘం కన్వీనర్ తాండ్ర నాగేంద్రశర్మ కోరారు. అక్టోబర్ 17న బతుకమ్మ పేర్చి నాటి నుంచి 24వ తేదీన దుర్గాష్టమి వరకు బతుకమ్మను ఎనిమిది రోజులు పేర్చి, పూజించి జానపదాలతో ఆడి నిమజ్జనం చేయాలని సూచించారు. ఈ ఏడాది అధిక ఆశ్వీయుజ మాసం వచ్చినందున బతుకమ్మ పండుగపై హిందువుల్లో కొంత సందిగ్ధం ఏర్పడిందని ఒక ప్రకటనలో తెలిపారు.
పెద్దల అమావాస్యనాడు పెద్దలకు బియ్యం ఇచ్చుకోవడంతోపాటు ఎంగిలిపూల బతుకమ్మ నిర్వహించడం మన ఆచారమని పేర్కొన్నారు. పంచాంగకర్తలు, పురోహితులు, పండితులైన అవసరాల ప్రసాద శర్మ సిద్ధాంతి, వెలిదె యుగం ధర్మశర్మ, పీతాంబరం శ్రీకాంతాచార్యులు, ఇతర ప్రముఖులు సమావేశమై ఈ మేరకు తీర్మానించారన్నారు.













