కవిత, ఆమె భర్త పేరుపై ఉన్న ఆస్తులు ఎన్ని..?
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మూడేళ్ల పాలనపై మాజీ ఎంపీ మధుయాష్కీ దుమ్మెత్తిపోశారు. కేసీఆర్ మూడేళ్ల పాలన దారిద్రపు పాలన అని ఆయన వ్యాఖ్యానించారు. కాపలా కుక్కగా ఉంటన్న కేసీఆర్.. ఇప్పుడు అధికారంతో దోచుకుంటున్నారని మధుయాష్కీ శుక్రవారమిక్కడ అన్నారు. తెలంగాణ అమరుల, ఆత్మహత్యలు చెసుకున్న రైతుల శాపం కేసీఆర్కు తప్పక తగులుతుందని విమర్శించారు. సర్వేలతోనే టీఆర్ఎస్ సర్వ నాశనం అవుతుందని వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ కుటుంబం.. అవినితీ సంపాదనను విదేశాలలో దాచుకున్నది నిజం కాదా? అంటూ… జీహెచ్ఎంసీలో అవినీతి కుంభకోణంపై కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని మధుయాష్కీ ప్రశ్నించారు. కుంభకోణానికి కేటీఆర్ ఎందుకు నైతిక భాధ్యత వహించలేదన్నారు. ఎంత మంది తెలంగాణ యువతకు ఉద్యోగాల వచ్చాయో కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఐటీ హబ్ పేరుతూ గబ్బు చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు ఇండ్లు కట్టించకుండా… బులెట్ ఫ్రూఫ్ బాత్ రూమ్ కట్టించుకోవడానికి మాత్రం డబ్బులున్నాయా అని నిలదీశారు.
మియాపూర్ భూ కుంభకోణంలో కేటీఆర్, కవిత, కేటీఆర్ బావ కన్నారావు పాత్ర ఎంతో తేలాలని అన్నారు. టీఆఆర్ఎస్ మంత్రులు సీమ పందులుగా మారారని విమర్శించారు. కేసీఆర్ దుష్ట పాలనకు అంతం.. సంగారెడ్డి నుండే మొదలవుతుందని శాపనార్థాలు పెట్టారు. కేసీఆర్ పాలనలో జరుగుతున్న అవినీతి పై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. కేసీఆర్ కుటుంబ దోపిడీ పై రాహుల్ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. ఈ అవినీతిపై త్వరలోనే సీబీఐని ఆశ్రయిస్తామని తెలిపారు.













