ఎమ్మెల్యే రాజాసింగ్కు బెయిల్ మంజూరు
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు ఎట్టకేలకు ఊరట లభించింది. హైకోర్టు అయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సమాజంలో మతవిధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారంటూ రాజాసింగ్పై ఇటీవల పోలీసులు పీడీ యాక్టు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ఆయన చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పోలీసులు పీడీ చట్టం నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాజాసింగ్ సతీమణీ ఉషాబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ కౌంటర్ దాఖలు చేశారు.
ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ను వ్యతిరేకిస్తూ రాజాసింగ్ తరపు న్యాయవాది రవిచందర్ వాదనలు వినిపించాయి. పీడీ చట్టం కింద నమోదైన కేసులను కొట్టివేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను రవిచందర్ ప్రస్తావించారు. రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సమాజంలో రెచ్చగొట్టేవిధంగా వ్యవహరిస్తున్నారని అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ వాదించారు. ఇప్పటికే ఆయనపై వివిధ పోలీస్ స్టేషన్లో 100కు పైగా కేసులు నమోదయ్యాయని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు తీర్పు వెలువరించింది.













