ఆర్ బీఐ గవర్నర్ సంచలన నిర్ణయం
భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 19న తన పదవికి రాజీనామ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ- ఆర్బీఐ మధ్య విభేదాలు ఇటీవల తీవ్రమైన నేపథ్యంలో ఉర్జిత్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 19న ఆర్బీఐ కేంద్ర బోర్డు సమావేశం జరగనుంది. ఈ సమావేశమే ఉర్జిత్ చివరి సమావేశం కానున్నట్లు సమాచారం. ప్రభుత్వంతో ఇక వాదించే ఓపిక తనకు లేదని, ఇప్పటికే అలసిపోయానని, అది తన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపిస్తోందని ఉర్జిత్ తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు తెలుస్తోంది. రిజర్వు బ్యాంకు స్వతంత్ర ప్రతిపత్తిని నీరుగార్చాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలకు ఉర్జిత్ అడ్డుకట్ట వేశారు. దీంతో రంగంలోకి దిగిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సెంట్రల్ బ్యాంకుకు తగిన సూచనలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని విసృష్ట ప్రకటన చేశారు. దీంతో ఆర్బీఐ- కేంద్ర ఆర్థిక శాఖ మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ఉర్జిత్ పటేల్ స్వచ్ఛందంగా తప్పుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.













