ఏపీలో చంద్రబాబు నాయుడుదే విజయం : రాహుల్
ప్రధాని మోదీని గద్దె దించాలని ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. కర్ణాటకలోని రాయచూరు, చిక్కోడిల్లో జరిగిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగిస్తూ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది కాంగ్రెస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్- జేడీఎస్ అధికారంలోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇతర రాష్ట్రాల్లో బీజేపీపై పోరాడుతున్న పార్టీలన్నీ గెలుస్తాయి. గుజరాత్ ప్రజలదీ ఇలాంటి నిర్ణయమే. ఆ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ను బలపరుస్తున్నారు. మోదీ దేశానికి కాదు కదా, కనీసం గురజాత్కు కూడా ఏమీ చేయలేదని అక్కడి వారు అంటున్నారు. తమ నుంచి లక్షలాది ఎకరాలు తీసుకొని పెద్ద పారిశ్రామికవేత్తలకు ఇచ్చారని విమర్శించారు. మోదీని ఈ సారి ఢిల్లీ నుంచి పంపించి వేస్తారు అని వ్యాఖ్యానించారు. దేశ భద్రత గురించి పదేపదే చెబుతున్న ప్రధాని కోట్లాది మంది యువతను నిరుద్యోగులుగా మార్చి దేశాన్ని ఏవిధంగా బలోపేతం చేస్తారని ప్రశ్నించారు. రఫేల్ యుద్ధ విమనాల కొనుగోలులో రూ.30 వేల కోట్లను వ్యాపారవేత్త అనిల్ అంబానీ జేబులోకి పోయేలా చేసిన వ్యక్తి దేశ భద్రత గురించి మాట్లాడం హాస్యాస్పదమన్నారు.













