వారికోసం పెద్దఎత్తున క్వారంటైన్ కేంద్రాలు : వైఎస్ జగన్
కరోనా నివారణ చర్యలు, లాక్డౌన్ పరిస్థితులు, వ్యవసాయ సంబంధ అంశాలపై ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో లాక్డౌన్ సడలింపు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిపట్ల తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఆయన చర్చించారు. విదేశాల నుంచి వచ్చే వారికి దాదాపుగా నాన్ కొవిడ్ సర్టిఫికెట్ ఉంటుందని, వారికి హోం క్వారంటైన్ విధిస్తామని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించి పరీక్షించి కరోనా సోకలేదని తేల్చాకే ఇళ్లకు పంపుతామని అధికారులకు సీఎంకు తెలిపారు. విదేశాలు, పలు రాష్ట్రాల నుంచి వచ్చే వారికోసం పెద్దఎత్తున క్వారంటైన్ కేంద్రాలు సిద్దం చేయాలని సీఎం ఆదేశించారు. దీనికోసం అనుసరించాల్సిన విధానంపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం జగన్ సూచించారు. క్వారంటైన్ కేంద్రాల్లో అందించాల్సిన సదుపాయాలు, వసతిపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని వాటిని నిరంతరం పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. క్వారంటైన్ కేంద్రాల్లో ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కొవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ కృష్ణబాబుకు సూచించారు. టెలీమెడిసిన్కు ఫోన్ చేస్తే ప్రిస్కిప్షన్ సహా మందులు విలేజ్ క్లినిక్ ద్వారా బాధితుల ఇంటికే సరఫరా చేయాలని జగన్ దిశానిర్దేశం చేశారు.













