ఏపీలో 4 వేల కోట్ల పెట్టుబడులు : చంద్రబాబు
పుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ దశ తిరగనుంది. ఈ రంగంలో రూ.4 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు పలు జాతీయ, అంతార్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయి. ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో ప్రారంభమైన వరల్డ్ పుడ్ ఇండియా సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో 17 ఒప్పందాలు కుదిరాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి చెందిన షరప్ గ్రూప్ సంస్థ రాష్ట్రంలో రూ.2వేల కోట్లతో పుడ్ పార్క్ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. కేవలం పుడ్ పార్కు ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పాదకత పెంపొందించడానికి కావాల్సిన సహకారాన్ని అందిస్తామని ఆ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు షరఫ్ గ్రూప్తో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుది. రూ.400 కోట్లతో పుడ్ ప్రాసెసింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ను ఏర్పాటు చేయడానికి హల్దీరామ్స్ సంస్థ ముందుకొచ్చింది. ఈమేరకు ఏపీ సర్కార్తో ఎంవోయూ చేసుకుంది.
రూ.500 కోట్లతో ఇంటిగ్రేటెడ్ హార్టీకల్చర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి జననీ పుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఒప్పందం చేసుకుంది. రూ.250 కోట్లతో బనానా ప్రొక్యూర్మెంట్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేయడానికి కెవెంటర్ ఆగ్రో లిమిటెడ్ ఎండీ మాయంక్ జలాన్ ఎంవోయూ చేసుకున్నారు. రాష్ట్రంలో బనానా క్లస్టర్ను ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని జలాన్ను చంద్రబాబు కోరారు. ఐటీసీ, శేషసాయి పుడ్స్, ఎంఎన్ఆర్ అగ్రీ పుడ్ ప్రొడక్ట్స్, పుడ్ అండ్ ఇన్స్, ఫ్రెష్ ప్రూగీస్, ఆర్ఎఫ్ ఎక్స్పోర్ట్స్, తిఫోసీ పుడ్స్, వేకూల్ సంస్థలతో ఏపీ సర్కార్ ఒప్పందాలు చేసుకుంది.
సేంద్రీయ సాగును ప్రోత్సహించడం, రైతులను మార్కెట్తో అనుసంధానం చేయడంలో సహకారం అందిందించేందుకు సూపర్ మార్కెట్ గ్రోసరీ సప్లయర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (బిగ్బాస్కెట్.కామ్) సంస్థ ముందుకొచ్చింది. కాగా, జర్మనీ ఆహార, వ్యవసాయ శాఖ మంత్రి పీటర్ బ్లీసర్, బీఏఎస్ ఎఫ్ ఇండియా లిమిటెడ్ సీఎండీ రామన్ రామచంద్రన్, తదితరులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు.













