త్వరలో నంద్యాలకు అమెరికా శాస్త్రవేత్తలు
కర్నూలు జిల్లా నంద్యాల పరిసర ప్రాంతాల్లోని సారవంతమైన భూమిని సద్వినియోగం చేసుకుంటూ దేశంలో అతిపెద్ద విత్తనోత్పత్తి సంస్థను ఏర్పాటు చేయడానికి అమెరికా నుంచి వ్వవసాయ శాస్త్రవేత్తలతో కూడిన బృందం త్వరలో పర్యటిస్తుందని అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల అమెరికాలో పర్యటించినప్పుడు అక్కడి విత్తనోత్పత్తి సంస్థలతో చర్చలు జరిపారు. నంద్యాలకు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని పలు సంస్థలు ఈ సందర్భంగా ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్ధం చేసిన నివేదికను వారు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
అయితే క్షేత్రస్థాయిలో పర్యటించి భూమిని పరిశీలించి అవసరమైతే మరిన్ని పరీక్షలు తాము నిర్వహించి సానుకూలంగా ఉంటే విత్తనోత్పత్తిపై పరిశోధనలే కాకుండా అత్యుత్తమ శాస్త్రవేత్తలను తయారు చేసేందుకు అవసరమైన విద్యను కూడా అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వారు హామీ ఇచ్చినట్లు అధికారుల ద్వారా అందుతున్న సమాచారం. దీంతో రాష్ట్రంలోనే కాకుండా దేశంలో వ్వవసాయ శాస్త్రంలో విద్యనభ్యసించేవారికి అదనంగా మరో విద్యాలయం అందుబాటులోకి వస్తుందని వారు వెల్లడిస్తున్నారు. విశ్వవిద్యాలయం తరహాలో విత్తనోత్పత్తిపై పరిశోధనలు, ఉత్పత్తి తదితర కోర్సులతోపాటు వ్వవసాయ శాస్త్రంలో ఇతర కోర్సులతో విశ్వవిద్యాలయ ఏర్పాటు చేసే అవకాశముందని సమాచారం. అయితే అమెరికా శాస్త్రవేత్తలు నంద్యాలకు ఎప్పుడు వస్తారన్న విషయంపై సృష్టత లేదు.













