కేంద్రంలో, తెలంగాణలో లేని ఆంక్షలు ఇక్కడే ఎందుకు?
ఎన్నికలకు, ఓట్ల లెక్కింపునకు 40 రోజుల వ్యవధి ఉండటం అనుచితమని ఇది ప్రజాపాలనకు ఆటకం కలిగిస్తుందని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ లేని అధికారాలను వినియోగించి ఈసీ రాష్ట్రంలో ప్రత్యేకమైన ఎన్నికలు జరిపించిందన్నారు. ఈ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు జరిగాయన్నారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఏం చెబితే ఎన్నికల కమిషన్ అది చేస్తోందన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిదికాదన్నారు. కేంద్రంలో, తెలంగాణలో లేని ఆంక్షలు ఆంధ్రప్రదేశ్లో ఎందుకని ప్రశ్నించారు. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీకటి రోజులని అభిప్రాయపడ్డారు. ఈసీకి వాస్తవ దృక్పథం లేకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)తో రాష్ట్రాన్ని నడిపించాలనుకోవటం మంచిది కాదన్నారు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రినే పక్కన బెట్టి సీఎస్తో పరిపాలన చేయించమని ఏ చట్టం చెబుతోందని ఆయన ప్రశ్నించారు. పోలింగ్ సందర్భంగా తన నియోజకవర్గం పరిధిలోని ఇనిమెట్ల ఘటనపై తాను చిత్తశుద్ధితో వున్నానని, అక్రమ కేసులకు భయపడబోమని ఆయన సృష్టం చేశారు.













