ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ .. ఈ నెల 22న తల్లికి వందనం
విద్యల తల్లులకు 22 నుంచి వం`ధనం`
1 నుంచి ఇంటర్ వరకూ 67,47,190 మంది విద్యార్థులకు లబ్ధి
24వ తేదీలోగా 42,70,802 మంది తల్లుల ఖాతాల్లో రూ. 10,120 కోట్లు జమ
గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే అంగన్ వాడీలకు కూడా తల్లికి వందనం వర్తింపు
అడ్మిషన్లు, వెర్ఫికేషన్ పూర్తికాని వారికి ఆగష్టులో నిధుల విడుదల
తల్లికి వందనం అర్హుల వివరాలు మనమిత్ర, లీప్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు
అమరావతి: ఏ మంచి పని చేపట్టాలన్నా తల్లిని తలచుకుని ప్రారంభిస్తారు. పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసానిచ్చేందుకు విద్యాశాఖను చేపట్టిన నారా లోకేష్..పిల్లల చదువులకు మూలధనంగా అందించే ఆర్థిక సాయం పథకానికి తల్లికి వందనంగా నామకరణం చేశారు. చదివే పిల్లలు అందరికీ వారి తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని ఎన్నికలకు ముందు యువగళం పాదయాత్రలో ఇచ్చిన మాట తూచా తప్పకుండా అమలుచేశారు. రెండో ఏడాది విద్యా సంవత్సరం ఆరంభంలోనే తల్లికి వందనం నిధులు 22వ తేదీ నుంచి తల్లుల ఖాతాల్లో జమ చేసేలా జీవో విడుదల చేశారు. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రూపొందించేందుకు లోకేష్ ఒక బృహత్తర యజ్ఞం చేపట్టారు. తల్లికి వందనం దేశంలోనే విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, అతి ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చే పథకంగా నిలుస్తోంది.
ఎటువంటి ఆంక్షల్లేకుండా..పిల్లలను చదివించడమే అర్హతగా రూపొందించిన తల్లికి వందనం పథకం నిధులు ఈనెల 22వతేదీ నుంచి 24వరకు తల్లుల ఖాతాలకు జమ అయ్యేలా ఏర్పాట్లు చేశారు. వరసగా రెండో ఏడాది విద్యా సంవత్సరం ఆరంభంలోనే నిధులు విడుదల చేయడం పిల్లల విద్యకు ఎంతో సాయంగా నిలవనుంది. గతసారి పట్టణ ప్రాంతాల అంగన్ వాడీలకు తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేశారు. ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న అంగన్ వాడీలకు కూడా తల్లికి వందనం పథకం ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 17 వేలమందికి పైగా అంగన్ వాడీ కార్యకర్తల పిల్లల చదువులకు తల్లికి వందనం పథకం కింద మూలధనం అందనుంది.
1 నుంచి 12వతరగతి వరకు విద్యనభ్యసించే 67,47,190 మంది విద్యార్థులకు సంబంధించి 42,70,802 మంది తల్లుల ఖాతాలో రూ.10,120 కోట్లను ప్రజాప్రభుత్వం జమ చేయనుంది. గత ప్రభుత్వ హయాంలో ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ కేవలం ఒక్కరికే డబ్బులు ఇచ్చేవారు. ఈ వివక్షాపూరిత విధానానికి ముగింపు పలికిన కూటమి ప్రభుత్వం చదువుకునే ప్రతిబిడ్డకు తల్లికి వందనం పథకం అందుతోంది.
ఏదైనా సాంకేతిక కారణాల వల్ల ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులు పడనివారికి నెలాఖరు నాటికి క్లియర్ చేయాలని మంత్రి లోకేష్ ఆదేశాలు జారీచేశారు. ఒకటో తరగతి, ఇంటర్ మొదటి ఏడాది అడ్మిషన్లు పూర్తి కాని లేదా ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి కాని లబ్దిదారులకు ఆగస్ట్ లో నిధులు విడుదల చేయనున్నారు. తల్లికి వందనం పథకం కింద అర్హులైన వారి వివరాలను మనమిత్ర, లీప్ యాప్ ల ద్వారా తెలుసుకునే అవకాశం కల్పించాలని మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… చదువుకునే ప్రతి చిన్నారికి తల్లికి వందనం పథకం అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టంచేశారు.








