OSAT సెమీకండక్టర్ నైపుణ్యాభివృద్ధికి సహకారం అందించండి : మంత్రి లోకేష్
అపాక్ట్ సీఈవో సియాంగ్ డాంగ్ లీతో మంత్రి నారా లోకేష్ భేటీ
సియోల్ (సౌత్ కొరియా): సెమీకండక్టర్స్, OSAT (అసెంబ్లింగ్, ప్యాకేజింగ్, టెస్టింగ్) రంగంలో పేరెన్నికగన్న ‘అపాక్ట్’ (APACT) కంపెనీ సీఈవో సియాంగ్ డాంగ్ లీ (Mr. Seong Dong Lee)తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్ లో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ASIP భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్లో అపాక్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అపాక్ట్తో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నట్లు చెప్పారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు పరిశీలిస్తున్న ‘హనా మైక్రాన్’ (Hana Micron)తో పాటు ఇతర OSAT సంస్థలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా అనుసంధానించాలని APACTని కోరారు. OSAT సెమీకండక్టర్ కార్యకలాపాలకు సంబంధించి యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం కోసం APSSDCతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని మంత్రి లోకేష్ ప్రతిపాదించారు. భారతదేశంలో అపాక్ట్ కార్యకలాపాల విస్తరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు.
అపాక్ట్ సీఈవో సియాంగ్ డాంగ్ లీ మాట్లాడుతూ… హైదరాబాద్ కోసం ఫిబ్రవరి 2024లో ప్రకటించిన ASIP టెక్నాలజీస్ జాయింట్ వెంచర్కు, విశాఖపట్నం కోసం 12 ఆగస్టు 2025న ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM) కింద ఆమోదం లభించిందని తెలిపారు. ₹468 కోట్లతో (~US$56 మిలియన్లు), సంవత్సరానికి 96 మిలియన్ల పరికరాలను తయారుచేసే లక్ష్యంతో ఏర్పాటు కానున్న విశాఖ యూనిట్ నిర్మాణం త్వరలోనే ప్రారంభమవుతుందని చెప్పారు. ASIP–APACT వైజాగ్ OSAT జాయింట్ వెంచర్ ఆంధ్రప్రదేశ్కు లభించిన ఒక ప్రతిష్టాత్మక సెమీకండక్టర్ విజయమని ఆయన అభివర్ణించారు. ఏపీ ప్రభుత్వం అందించిన ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని ఈ సందర్భంగా లీ తెలిపారు.








