దిశ చట్టం నాతోనే మొదలవ్వాలి…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలు, చిన్నారుల భద్రత కోసం దిశ చట్టం తీసుకువచ్చిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని స్పందించారు. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. దిశ చట్టం అమలును తనతోనే మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. మద్య నియంత్రణపై తాను సభలో మాట్లాడిన మాటలపై సోషల్ మీడియాలో దారుణమైన పోస్టులు దర్శనమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై అసత్యప్రచారం చేస్తున్నవారిలో వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్నారని సభాముఖంగా హోంమంత్రికి తెలిపారు. దిశ చట్టం తనతోనే మొదలవ్వాలనీ అసెంబ్లీ ముఖంగా ప్రభుత్వాన్ని కోరుతున్నానని ఆదిరెడ్డి భవాని శాసనసభలో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధి అయిన తనకే ఇలాంటి పరిస్థితి వస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.













