ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్- విద్యుత్ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
18 గిగావాట్లను ప్రధాన గ్రిడ్కు కనెక్ట్ చేసేలా సుమారు రూ.22 వేలకోట్లతో ప్రతిపాదనలు
ప్రభుత్వ భవనాలపై సోలార్ ఏర్పాటు పనులు త్వరితగతిన చేపట్టాలి
2,898 హాస్టళ్లు, స్కూళ్లలో నెట్ జీరో విధానంలో సొలారైజేషన్
నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పీఎం సూర్యఘర్ అమలు
రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు చేసి.. ఆ మేరకు విద్యుత్ నెట్ వర్క్ను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 18 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ప్రధాన గ్రిడ్కు అనుసంధానించేందుకు గ్రీన్ ఎనర్జీ కారిడార్-3లో భాగంగా సుమారు రూ. 22 వేల కోట్లతో ప్రతిపాదనలు సిద్దం చేసింది. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ శాఖపై సమీక్షించారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ అంశం సహా విద్యుత్ సరఫరా పరిస్థితి, వచ్చే ఆరు నెలల ప్రణాళిక, పీఎం సూర్య ఘర్, పీఎం కుసుమ్, పీఎంఈ-డ్రైవ్ పథకాల పురోగతి, ఏపీఐఈసీ పాలసీ కింద ఆమోదించిన వివిధ ప్రాజెక్టుల పరిస్థితి, నెడ్క్యాప్ బలోపేతం, డిజిటల్ ట్విన్ గ్రిడ్ నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్లో భాగంగా ట్రాన్స్మిషన్ నెట్వర్క్ విస్తరించే అంశంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని సీఎం చంద్రబాబు అధికారులను అడిగారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్-3 కింద సుమారు 18 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ప్రధాన గ్రిడ్కు అనుసంధానించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ఈ మేరకు కొత్త ట్రాన్స్మిషన్ లైన్లు, పూలింగ్ స్టేషన్లను నిర్మించనున్నట్టు వెల్లడించారు. మొత్తంగా 18 గిగావాట్లల్లో సోలార్ ద్వారా ఉత్పత్తి అయ్యే 11 గిగా వాట్ల విద్యుత్ ను… అలాగే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే సుమారు 7 గిగావాట్ల విద్యుత్ ను ప్రధాన గ్రిడ్ కు అనుసంధానించేలా చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు వివరించారు. ఈ మేరకు 2,261 కిలో మీటర్ల మేర కొత్త ట్రాన్స్ మిషన్ లైన్లు వేయనున్నట్టు వెల్లడించారు. ఈ కారిడార్లో భాగంగా 9,500 మెగా వాట్ల సామర్థ్యంతో 5 భారీ పూలింగ్ స్టేషన్లను నిర్మించేలా ప్రణాళికలు సిద్దం చేసినట్టు అధికారులు వెల్లడించారు. ముదిగుబ్బ, తలుపుల, రామాయపట్నం, పోరుమామిళ్ల, కొప్పాక ప్రాంతాల్లో పూలింగ్ స్టేషన్లను నిర్మించనున్నట్టు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… గ్రీన్ ఎనర్జీలో 160 గిగా వాట్ల ఉత్పత్తికి లక్ష్యం నిర్దేశించుకున్నామని.. దానికి అనుగుణంగా నెట్ వర్క్ను కూడా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఏపీ గ్రీన్ ఎనర్జీ కారిడార్ పూర్తి అయితే.. రాష్ట్రంలో డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ ను సరఫరా చేసేందుకు ఈ నెట్ వర్క్ బాగా ఉపకరిస్తుందని అభిప్రాయపడ్డారు. ఇక విద్యుత్ మౌళిక సదుపాయాలు పెరిగితే.. ఆయా రంగాల్లో పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున వస్తాయని సూచించారు. ఈ ప్రాజెక్టును మొదలు పెట్టడంతోపాటు… టైమ్ బౌండ్ కార్యక్రమంగా పెట్టుకుని పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
పీఎం సూర్య ఘర్ అమలులో వేగం పెరగాలి
సమీక్షలో భాగంగా పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ వంటి పథకాల అమలుపై సీఎం అధికారులతో చర్చించారు. అలాగే ప్రభుత్వ భవనాల సొలారైజేషన్ పనులు ఎంత వరకు వచ్చాయని అధికారులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 మెగా వాట్ల సామర్థ్యంతో ప్రభుత్వ భవనాల సొలారైజేషన్ ప్రక్రియను మొదలు పెట్టినట్టు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ భవనాల సొలారైజేషన్ ప్రక్రియలో భాగంగా రెస్కో మోడల్ అనుసరిస్తున్నామని అధికారులు తెలిపారు. నెట్ మీటరింగ్ విధానంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్ కింద చిత్తూరు జిల్లాలోని 78 గురుకుల పాఠశాలలు, వసతి గృహాలను ఎంపిక చేసినట్టు చెప్పారు. అలాగే నెట్ జీరో విధానంలో హెల్తీ క్యాంపస్ లను తీర్చిదిద్దేలా సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసేందుకు 2,898 హాస్టళ్లు, స్కూళ్లల్లో గుర్తించినట్టు అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో, స్కూళ్లలో సోలార్ వినియోగం పెరిగితే.. ప్రభుత్వంపై విద్యుత్ భారం తగ్గుతుందని సీఎం చెప్పారు. ఈ విషయంలో అధికారులు పూర్తిగా ఫోకస్ పెట్టాలని స్పష్టం చేశారు. పీఎం సూర్యఘర్ పథకం అమల్లో ఏపీ నాలుగో స్థానంలో ఉందని… అగ్రస్థానంలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి 1,35,821 ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు అమర్చామని.. మిగిలిన వాటిని ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇక బీసీ వర్గాలకు రూ. 20 వేల సబ్సిడీతో 10 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెళ్లను బిగించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని… వీటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం సూచించారు. ఇక రాష్ట్రంలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 131 ప్రాంతాల్లో 577 ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించినట్టు అధికారులు వెల్లడించారు.
స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన ‘ప్రవాహ్’ సంస్థ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ సహకారంతో, ఏపీఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ సాంకేతిక నష్టాలను తగ్గించేలా చర్యలు తీసుకుంటున్న విధానాన్ని అధికారులు ప్రజెంట్ చేశారు. ఈ తరహాలో విద్యుత్ సరఫరా కోసం దేశంలోనే మొదటిసారిగా డిజిటల్ ట్విన్ గ్రిడ్ రూపొందిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ సమీక్షలో భాగంగా విద్యుత్ డిమాండ్ ఏ మేరకు ఉందనే విషయాన్ని అధికారులు సీఎంకు వివరించారు. జూన్ 2026 నుంచి నవంబర్ 2026 వరకు రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 12,226 మెగావాట్లకు చేరి, రోజువారీ డిమాండ్ 226 నుంచి 261 మెగా యూనిట్లు వరకు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మే 21న రాష్ట్రంలో అత్యధికంగా 15,016 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదైందని చెప్పారు. మే 27 వరకు 7,060 మెగాయూనిట్ల విద్యుత్ వినియోగం జరిగిందని అధికారులు వెల్లడించారు. 2025తో పోలిస్తే ఏప్రిల్–మే 2026 కాలంలో గరిష్ట డిమాండ్ 14.48 శాతం నుంచి 16.77 శాతానికి విద్యుత్ వినియోగం పెరిగిందని అధికారులు చెప్పారు. రైతులకు ఆర్థికంగా లబ్ధికలిగే సీబీజీ(కంప్రెస్డ్ బయో గ్యాస్)ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహించేలా పాలసీ చేశామని, సీబీజీ ప్లాంట్ల ఏర్పాటు విషయంలో అధికారులు చొరవ తీసుకుని త్వరితగతిత ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
సీఎంను కలిసిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం బృందం
వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయింది. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి థీమాటిక్ సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రీయల్ రెవెల్యూషన్- C4IR అమలు చేయాల్సిన కార్యాచరణపై ఈ బృందం చర్చించింది. C4IR ఏర్పాటుపై ఏపీ ట్రాన్స్ కో-వరల్డ్ ఎకనమిక్ ఫోరంతో గతంలోనే ఒప్పందం కుదిరింది. గ్రీన్ ఎనర్జీ, ఎనర్జీ ట్రాన్సిషన్, సైబర్ రెసిలియెన్స్ వంటి రంగాలపై C4IR అధ్యయనం చేయనుంది. రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సూచించారు. వివిధ రకాల విద్యుత్ ఉత్పత్తి మోడళ్లను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి బెస్ట్ మోడల్ తయారు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విశాఖ డేటా సెంటర్ కారిడార్, గ్రీన్ హైడ్రోజన్ పెట్టుబడులు, పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని C4IR కార్యాచరణతో అనుసంధానం చేయాలని సూచించారు. రిజల్ట్ ఓరియేంటేషనుతో C4IR పని చేయాలని సీఎం ఆదేశించారు. వచ్చే దావోస్ సదస్సు నాటికి నాటికి ఏపీ సాధించిన పురోగతిని ప్రదర్శించే స్థాయికి తీసుకెళ్లాలని C4IRకు సీఎం సూచించారు. ఈ సమావేశంలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్, సీఎస్ సాయిప్రసాద్, విద్యుత్, ట్రాన్స్ కో, జెన్కో, డిస్కంలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.







