Chandrababu: చంద్రబాబు మరో ఘనత.. 15 ఏళ్ల పాటు సీఎంగా పదవీ బాధ్యతలు..!

ఆయన నడక పూలబాట కాదు.. ఆయన ఎదుర్కొంది ఆశామాషీ నేతలను కాదు.. ఎందరో గండరగండలు.. రాజకీయ దిగ్గజాలను ఎదుర్కొని అపజయాలతో పాటు విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తున్నారు. అపజయానికి కుంగిపోకూడదు.. విజయానికి పొంగిపోకూడదన్న సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ… తన పార్టీ పతాకాన్ని ఆంధ్రదేశంలో రెపరెపలాడిస్తున్నారు. అభివృద్ధి, సాంకేతిక నైపుణ్యం అనే పదాలను రెండు కళ్లలా చేసుకుని ప్రస్తుతం ఏపీలో సీఎంగా పరిపాలన సాగిస్తున్నారు. ఏజ్ అనేది ఓ నెంబర్ మాత్రమే అని పదేపదే చెబుతూ వస్తున్న ఆ రాజకీయ దిగ్గజం.. ప్రస్తుతం ఏపీసీఎం చంద్రబాబు.. 15 ఏళ్ల పాటు అధికార బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తన రాజకీయ జీవితంలో మరో చారిత్రక మైలురాయిని అధిగమించారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి, ముఖ్యమంత్రిగా నేటితో (అక్టోబరు 10) …15 సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రులుగా పనిచేసిన నేతల జాబితాలో దక్షిణాది నుంచి ఈ ఘనత సాధించిన మూడో వ్యక్తిగా ఆయన నిలిచారు. ఇంతకుముందు తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి, పుదుచ్చేరి సీఎం ఎన్.రంగస్వామి మాత్రమే ఈ రికార్డును అందుకున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత కూడా చంద్రబాబు పేరు మీదే ఉంది. ఆయన ఉమ్మడి రాష్ట్రానికి 8 సంవత్సరాల 255 రోజులు సీఎంగా సేవలు అందించారు. ఇక, నవ్యాంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఇప్పటివరకు 6 సంవత్సరాల 110 రోజులు పూర్తి చేసుకున్నారు. మొత్తంగా 15 ఏళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగి, ఎంజీ రామచంద్రన్, జయలలిత, ఈకే నయనార్ వంటి ప్రముఖ నేతలను సైతం అధిగమించారు.
సంస్కరణలు, సంక్షోభాల ప్రస్థానం
ఎదురైన రాజకీయ సంక్షోభాలను తట్టుకుని నిలబడటం, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సంస్కరణలు చేపట్టడం చంద్రబాబు రాజకీయ ప్రస్థానంలో కీలక ఘట్టాలు. 1995 సెప్టెంబరు 1న పార్టీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పాలనలో చేపట్టిన అనేక సంస్కరణలు తొలుత విమర్శలకు దారితీసినా, భవిష్యత్తులో అద్భుత ఫలితాలనిచ్చాయి. హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చడంలో భాగంగా హైటెక్ సిటీకి పునాది వేయడం, విద్యుత్ రంగంలో తీసుకొచ్చిన మార్పులు, ఇంజనీరింగ్ విద్యను ప్రోత్సహించడం వంటి నిర్ణయాలు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయి.
2004లో ఓటమి తర్వాత పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్నా పార్టీని కాపాడుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా గెలిచారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఓటమి, తీవ్ర నిర్బంధ పరిస్థితులు, అరెస్టు వంటి కఠిన సవాళ్లను ఎదుర్కొన్నారు. వాటన్నింటినీ అధిగమించి, 2024లో కూటమితో కలిసి ఘన విజయం సాధించి తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. తిరుపతి సమీపంలోని ఓ కుగ్రామం నుంచి మొదలైన ఆయన ప్రయాణం, 15 ఏళ్ల ముఖ్యమంత్రిగా సాగడం ఆయన రాజకీయ దార్శనికతకు నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.