ఏపీ పారిశ్రామిక కారిడార్ కు మహర్దశ
ఏపీ పారిశ్రామిక కారిడార్కు మహర్దశ పట్టింది. నర్సన్నపేట – రణస్థలం సెక్షన్లోని జాతీయ రహదారిని 6 వరుసలకు విస్తరించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 54 కిలోమీటర్ల పరిధిలో విస్తరించనున్న ఈ రహదారికి రూ. 1423 కోట్లు ఖర్చు చేయ నున్నారు. పునర్ వ్యవస్థీకరణ తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన తొలిసారి సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు నిర్ణయాలు తీసుకుంది. అత్యంత రద్దీగా ఉండే కోల్కతా – కటక్- భువనేశ్వర్ – విశాఖపట్నం – విజయవాడ- చెన్నై 16వనెం.జాతీయ రహదారిలోనున్న నర్సన్నపేట – రణస్థలం సెక్షన్ను ఆరువరుసర రహదారిగా అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.
ఎచ్చెర్ల, రణస్థలం వద్ద బైపాస్లతో పాటు మొత్తం 29 ్లఫఓవర్లు, అండర్లు పాస్ లు నిర్మించనున్నారు. పార్కింగ్ ఏరియాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. ట్రక్ డ్రైవర్లు విశ్రాంతి తీసుకునేందుకు సైతం ఏర్పాట్లు చేయనున్నారు. సర్వీసు రోడ్ల నిర్మాణంతో పాటు రద్దీని తట్టుకునేందుకు, భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని ఆరులైన్ల రోడ్డుగా విస్తరించనున్నారు. ఈ రోడ్డు పనుల కారణంగా స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుంది. దీని ఫలితంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు, వాహనాల వేగం పెరగనుంది. ఏపిఐఐసి సెజ్ పారిశ్రామిక కారిడార్ పైడిభీమవరం, భోగాపురం ఎయిర్పోర్టు, వైజాగ్స్టీల్ ప్లాట్, విశాఖపట్నం పోర్టు, గంగవరం పోర్టు, దివిస్ లాబోరేటరీస్, తదితర ప్రముఖ ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధికి ఈ రహదారి ఉపయోగపడుతుంది. ఏపీ రహదారుల మౌలిక వసతులు అభివృద్ధి కానున్నాయని కేంద్రప్రభుత్వం తెలిపింది.













