అమరావతి నిర్మాణం ఎలా!?: చంద్రబాబుతో బోయపాటి చర్చ
నవ్యాంధ్ర రాజధానిలో తెలుగు సంస్కృతి, ఆధ్యాత్మిక వాతావరణం ప్రతిబింబించేందుకు ఏం చేయాలనే అంశంపై సినీ దర్శకుడు బోయపాటి శ్రీను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించారు.
బుధవారం చంద్రబాబుతో బోయపాటి భేటీ అయ్యారు. అమరావతి నగరం నిర్మాణ దశ నుంచే ఈ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇందుకు అనుగుణంగా ఆధ్మాత్మికత ఉట్టిపడేలా చేయడంపై వివిధ రంగాల నిపుణుల సూచనలు తీసుకొంటున్నారు. ఇందులో భాగంగా బోయపాటి కలిశారని అంటున్నారు. కాసేపు రాజధాని నిర్మాణం అంశాలపై మాట్లాడుకున్నారు.
విజయవాడలో సింగపూర్ కన్సార్టియం
అమరావతిలో 1,691 ఎకరాల స్టార్టప్ ఏరియా అభివృద్ధికి మాస్టర్ డెవలపర్గా ఎంపికైన సింగపూర్కి చెందిన అసెండాస్-సింగ్బ్రిడ్జి, సెంబ్కార్ప్ సంస్థల కన్సార్టియం ప్రతినిధులు వీలైనంత త్వరలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
విజయవాడలో తమ కార్యాలయం ఏర్పాటుకు ఒక భవనాన్ని ఎంపిక చేసుకున్నారు. బెంజ్ సర్కిల్కి సమీపంలోని ఆ భవనంలో వీలైనంత త్వరలోనే సింగపూర్ కన్సార్టియం తమ ఆఫీస్ను ప్రారంభించనుంది.
మరోపక్క ప్రాజెక్టు పర్యవేక్షణకు సింగపూర్ ప్రభుత్వం తరపున కూడా మరో కార్యాలయం ఏర్పాటు కానుంది. మూడు రోజులుగా విజయవాడలోనే మకాం వేసిన 13 మంది సింగపూర్ ప్రతినిధులు బుధవారం కూడా సీఆర్డీఏ, ఏడీసీ అధికారులతో చర్చలు జరిపారు.
ఈ బృందంలో సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ ప్రతినిధులు ఇద్దరు, కన్సార్టియం ప్రతినిధులు 11 మంది ఉన్నారు. రాజధాని అమరావతి భౌగోళిక స్వరూపం, సింగపూర్కి చెందిన సుర్బానా-జురాంగ్ సంస్థలు రూపొందించిన రాజధాని మాస్టర్ ప్లాన్, కేంద్ర రాజధాని ప్రాంత ప్రణాళికలపై అవగాహన తెచ్చుకోవడం, రాజధానిలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఏడీసీ రూపొందించిన ప్రణాళికను అధ్యయనం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించారు.













