Nara Lokesh: నారా లోకేశ్… మరింత ఎత్తుకు..!?
తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శిగా (General Secretary) ఉన్న నారా లోకేశ్కు (Nara Lokesh) ఈ ఏడాది మహానాడు సందర్భంగా పదోన్నతి లభించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మే 27 నుంచి 29 వరకు కడపలో (Kadapa) జరగనున్న ఈ మహానాడులో (Mahanadu) లోకేశ్ను జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా (Working President) నియమించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో, లోకేశ్ పదోన్నతి టీడీపీ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపనుందనే చర్చ రాజకీయ విశ్లేషకుల మధ్య హాట్ టాపిక్గా మారింది.
నారా లోకేశ్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) కుమారుడిగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. 2014లో టీడీపీ (TDP) అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అయితే 2019 ఎన్నికల్లో మంగళగిరి (Mangalagiri) నియోజకవర్గం నుంచి పోటి చేసిన లోకేశ్ అక్కడ ఓడిపోయారు. ఈ సవాళ్లను అధిగమించి, 2019-2024 మధ్య కాలంలో లోకేశ్ తన రాజకీయ వ్యూహాలతో పార్టీని బలోపేతం చేశారు. యువగళం పాదయాత్ర ద్వారా 3,200 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి, ప్రజలతో నేరుగా సంబంధాలు ఏర్పరచుకున్నారు. 2023లో చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో లోకేశ్ పార్టీని సమర్థవంతంగా నడిపించి, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. 2024 ఎన్నికల్లో మంగళగిరిలో భారీ మెజారిటీతో గెలిచి.. ఐటీ, హెచ్ఆర్డీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ప్రస్తుతం లోకేశ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మహానాడులో ఆయనను జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా లేదా జాతీయ అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ పదోన్నతి లోకేశ్ బాధ్యతలను పెంచబోతోంది. తన వారసుడిగా చంద్రబాబు నాయుడు చాలాకాలంగా లోకేశ్ ను ప్రమోట్ చేస్తున్నారు. అంతేకాక.. భవిష్యత్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసేందుకు ఈ ప్రమోషన్ దోహదపడుతుందని భావిస్తున్నారు. లోకేశ్ స్వయంగా పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకే పదవిలో మూడు టర్మ్ లకు మించి కొనసాగకూడదని సూచించారు. అందులో భాగంగానే ఈసారి తన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి పైకి వెళ్లాలని లేదా విరామం తీసుకోవాలని చెప్పినట్లు తెలుస్తోంది.
లోకేశ్ పదోన్నతి వెనుక పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఆలోచన కూడా ఉంది. టీడీపీలో యువ నాయకులకు అవకాశాలు కల్పించి, పార్టీని మరింత డైనమిక్గా మార్చాలని లోకేశ్ భావిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ సీనియర్ నాయకులతో సమతుల్యతను కాపాడుకోవడం కీలకం. కొందరు సీనియర్ నాయకులు లోకేశ్ తన టీంకు ప్రాధాన్యత ఇస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, ఆయన రాజకీయ నైపుణ్యం, ప్రజలతో సంబంధాలు ఈ అసంతృప్తిని అధిగమించేందుకు దోహదపడతాయని విశ్లేషకులు అంటున్నారు.
లోకేశ్ పదోన్నతి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇటీవల లోకేశ్ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్లు వచ్చినప్పుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్తో సంబంధాలు కొంత ఒడిదొడుకులకు లోనయ్యాయి. అయితే, లోకేశ్ పార్టీలో ఉన్నత పదవి చేపడితే, రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఆయన ప్రభావం పెరిగే అవకాశం ఉంది. మరోవైపు.. పార్టీలో అంతర్గత విభేదాలను సమర్థవంతంగా నిర్వహించడం, కూటమి భాగస్వాములతో సమన్వయం కాపాడడం, ప్రజల్లో తన ఇమేజ్ను మరింత బలోపేతం చేయడం వంటివి ఆయన ముందున్న ప్రధాన సవాళ్లు.













