క్వారంటైన్ పూర్తయిన వారికి రూ.2 వేలు
క్వారంటైన్ కేంద్రంలో గడువు పూర్తయిన కరోనా అనుమానితులందరికీ రూ.2 వేల ఆర్థిక సాయం అందించాలని ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్వారంటైన్ కేంద్రాల్లో కావాల్సిన సదుపాయాలు కల్పించాలని రోజువారీ కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం ఉన్నతస్థాత సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందుతున్న తీరు, పరీక్షల నిర్వహణ, ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలను అధికారులు జగన్కు వివరించారు. ప్రస్తుతం రోజుకు 2100కు పైగా కరోనా పరీక్షలు చేస్తున్నామని, మరో నాలుగైదు రోజుల్లో పరీక్షల రోజువారీ సామర్థ్యాన్ని 4 వేలకు పెంచుతామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన సుమారు 32 వేల మందికి పరీక్షలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మండలాన్ని ఒక యూనిట్గా తీసుకుని పరీక్షలు చేయాలని అధికారులకు సూచించారు. క్వారంటైన్లో చికిత్స పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను బాధితులకు వివరించాలన్నారు. తర్వాత కూడా వారంతా ప్రతి వారం పరీక్షలు చేయించుకునేలా అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం చర్యలు తీసుకోవాలని, రైతులను ఆదుకోవడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.













