కరుణానిధికి కన్నీటి వీడ్కోలు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. మెరీనా బీచ్లోని అన్నా స్క్వేర్ ప్రాంగణంలో ప్రభుత్వ లాంఛనాలతో కరుణ అంత్యక్రియలు ముగిశాయి.లక్షలాది మంది అభిమానులు, డీఎంకే కార్యకర్తల అశ్రు నయనాల మధ్య ద్రవిడ ఉద్యమ సూరీడు, తమిళనాడు రాజకీయ దిగ్గజం కరుణానిధి అంత్యక్రియలు ముగిశాయి. చెన్నై మెరీనా బీచ్లో కరుణానిధికి కన్నీటి వీడ్కోలు పలికారు. తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు డీఎంకే శ్రేణులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు మెరీనా బీచ్కు భారీగా తరలివచ్చారు. కరుణానిధి సతీమణి రాజాత్తి అమ్మాళ్, కుమారులు ముత్తు,అళగిరి, స్టాలిన్, కుమార్తెలు సెల్వి, కనిమొళి, మారన్ సోదరులు, ఇతర కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు హాజరై కన్నీరు మున్నీరుగా విలపించారు.
కాంగ్రెస్ నేత గులాంనబీ అజాద్, వీరప్పమొయిలీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి తదితరులు కరుణానిధి పార్థివదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ, జేడీయూ నేత దేవెగౌడ, ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణ, డీఎంకే నేతలు కరుణానిధి అంతిమ సంస్కారాలకు హాజరయ్యారు. తన రాజకీయ గురువు అన్నాదురై స్మారక కేంద్రానికి ఆనుకుని ఉన్న అన్నా స్వ్కేర్లో కేంద్ర ప్రభుత్వ లాంఛనాలతో ఖననం చేశారు. త్రివిధ దళాలు కరుణ పార్థీవదేహాన్ని ప్రత్యేకంగా తయారు చేసిన పేటికలో ఉంచి ఖననం చేశారు. ఆ సమయంలో భద్రత బలగాలు గౌరవసూచకంగా గాల్లోకి కాల్పులు జరిపారు.













