USA: షట్ డౌన్(Shut down) గండం నుంచి గట్టెక్కిన అమెరికా..
Washington: అగ్రరాజ్యం అమెరికా ఎట్టకేలకు షట్డౌన్ గండం నుంచి గట్టెక్కింది.. ట్రంప్ డిమాండ్లతో నిలిచిపోయిన కీలక నిధుల బిల్లును ప్రతినిధుల సభ చివరి క్షణంలో ఆమోదించింది. శుక్రవారం అర్ధరాత్రి లోగా ఉన్న గడువుకు కొన్ని గంటల ముందు స్పీకర్ మైక్ జాన్సన్ ప్రవేశపెట్టిన కొత్త ప్రణాళికకు ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. అయితే, కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) లేవనెత్తిన డిమాండ్లను ఈ ప్రణాళిక నుంచి తొలగించింది. అనంతరం ఈ బిల్లును సెనెట్కు పంపారు…!
ప్రభుత్వ కార్యకలాపాలు, జీతాలకు సంబంధించి ప్రభుత్వానికి నిధులు సమకూర్చేలా బైడెన్ ప్రభుత్వం బిల్లు (Funding Bill)ను తీసుకొచ్చింది. దీన్ని తొలుత ట్రంప్ తిరస్కరించారు. సమాఖ్య ప్రభుత్వ కార్యకలాపాలకు నిధులు సమకూర్చడంతోపాటు, వివిధ ఆర్థిక బాధ్యతలు నిర్వర్తించేందుకు ఈ బిల్లులో రెండేళ్లపాటు రుణాలపై పరిమితిని ఎత్తివేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ట్రంప్ ప్రతిపాదనను చేరుస్తూ ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ గురువారం సరికొత్త బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అయితే, దీన్ని ప్రతినిధుల సభ 235-174తో తిరస్కరించింది. ఏకంగా 38 మంది రిపబ్లికన్ సభ్యులే డెమోక్రాట్లతో కలిసి బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు..
మరోవైపు, ఈ పరిణామాలపై శ్వేతసౌధం కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. షట్డౌన్ వస్తే అధికార మార్పిడికి అంతరాయం కలుగుతుందని హెచ్చరించింది. దీంతో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అటు రిపబ్లికన్ల నుంచే వ్యతిరేకత రావడంతో ఈ బిల్లులో మళ్లీ మార్పులు చేశారు. ట్రంప్
(Trump) చేసిన డిమాండ్లను తొలగించి సమాఖ్య కార్యకలాపాలకు నిధులు, విపత్తు సహకారం వంటి అంశాలతో 118 పేజీల మరో కొత్త ప్యాకేజీ బిల్లును స్పీకర్ మైక్ జాన్సన్ శుక్రవారం ప్రవేశపెట్టారు. దీనికి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. 366-34తో ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. మెజార్టీ రిపబ్లికన్లు ఈ కొత్త బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. అనంతరం దీన్ని సెనెట్కు పంపించారు. సెనెట్ కూడా ఈబిల్లును ఆమోదించడంతో సమస్య సమసిపోయింది.






