బ్యాడ్మింటన్ కు పీవీ సింధు రిటైర్మెంట్ ?
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు ఆటకు రిటైర్మెంట్ ప్రకటించారు. కరోనా వైరస్ కారణంగా తాను ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు తెలిపారు. ట్విటర్ వేదికగా ఆమె ఈ విషయాన్ని ధ్రువీకరించారు. నేను రిటైర్ అయ్యాను. డెన్మార్క్ ఓపెన్ నా చివరి ఆట అని పీవీ సింధు తెలిపారు. అనంతరం భావోద్వేగ పూరితంగా ఓ సుధీర్ఘ ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటనలో కరోనా మహమ్మారి నాకు కనువిప్పుగా మారింది. నా ప్రత్యర్థితో పోరాడటానికి కఠోరమైన శిక్షణ తీసుకునేదాన్ని. చివరి వరకు పోరాడేదాన్ని. ఇంతకు ముందు చేశాను, ఇకపై కూడా చేయగలను.
కానీ, కంటికి కనిపించని వైరస్ను ఎలా ఓడించగలను. నెలలు గడుస్తున్నాయి. బయటకు వెళ్లాలనుకునే ప్రతీసారి ఆలోచిస్తున్నాము. విశ్రాంతి లేని ఆటకు స్వస్తి పలకాలని నిశ్చయించుకున్నాను. నెగిటివిటీ, భయం, అనిశ్చితి నుంచి రిటైర్ అవ్వబోతున్నాను. ప్రతీరోజు సోషల్ మీడియాతో చదువుతున్న కథనాలను నన్ను నేను ప్రశ్నించుకునేలా చేశాయి. మనం మరింత సంసిద్ధంగా ఉండాలి. కలిసికట్టుగా వైరస్ను ఓడించాలి. మనం ఇప్పుడు తీసుకునే నిర్ణయం మన, మన భావితరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. వారిని ఓడిపోనివ్వకుండా చూడాలి అని ఆమె పేర్కొన్నారు.













