ప్రధాని మోదీ ఏరియల్ సర్వే…

యాస్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రధాని పర్యటించారు. ఒడిశాలోని భద్రాక్ బాలేశ్వర్ జిల్లాల్లో, పశ్చిమ బెంగాల్లోని పూర్బా మెడినిపూర్లో తుపాను ప్రభావిత ప్రాంతాలలో ఏరియల్ సర్వే చేపట్టారు. అనంతరం ఒడిశా, బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు తక్షణ సహాయక చర్యల కింద రూ.1,000 కోట్ల ఆర్ధిక సహాయం ప్రకటించారు. భువనేశ్వర్లో ప్రధాని అధ్యక్షతన పునరావాస చర్యలకు సంబంధించి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమవేశంలో యాస్ తుఫాను కారణంగా గరిష్ట నష్టం ఒడిశాలో జరిగిందని, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లోని కొన్ని ప్రాంతాలు కూడా ప్రభావితమైనట్లు ప్రధానికి అధికారులు వివరించారు. ఇందులో ఒడిశాకు రూ.500 కోట్లు, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు కలిపి రూ.500 కోట్లు ఇవ్వనున్నట్లు మోదీ ప్రకటించారు.
తుఫాను కారణంగా చనిపోయినవారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల పరిహారం, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. తుఫాను కారణంగా బాధపడుతున్న వారందరికీ ప్రధాని తన సంపూర్ణ సంఘీభావం తెలిపారు. తుఫాను ప్రభావిత రాష్ట్రాలలో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను సందర్శించడానికి ఒక మంత్రి బృందాన్ని నియమించనున్నట్లు కేంద్రం తెలిపింది. ఆ కేంద్ర బృందం నివేదిక ఇచ్చిన ఆధారంగా మరింత సహాయం అందించనున్నట్లు తెలిపింది.