గాలిని కూడా ఎత్తుకెళ్ళిపోతున్నారు…!
తెలుగు రాష్ట్రాల్లోనూ, దేశంలోని ఇతర చోట్ల కరోనా రోగులకు లభించాల్సిన ఆక్సిజన్ డిమాండ్కు తగ్గట్టుగా అందుబాటులో లేకపోవడంతో కోవిడ్ పేషంట్లు తమ ప్రాణాలను కాపాడాల్సిందిగా దేవుణ్ణే నమ్ముకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మెడికల్ ఆక్సిజన్ కొరత కరోనా రోగులను వేధిస్తోంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్లోని దమోహ్ జిల్లాలోని ఓ ఆసుపత్రిలో కొందరు దుండగులు మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లను దోచుకుపోయారట. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు.. నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. కాగా ఆక్సిజన్ సిలిండర్ల లూటీ విషయాన్ని జిల్లా పాలనాధికారి తెలిపారు. ఇప్పటికే ఆ రాష్ట్రం ఆక్సిజన్ కొరతతో అతలాకుతలమవుతోంది. ఆ రాష్ట్రంలో అసలు ఆక్సిజన్ తయారీ ప్లాంట్ లేదు. రోజుకు 250 టన్నుల ఆక్సిజన్ మధ్యప్రదేశ్కు కావాల్సి ఉండగా గుజరాత్, ఉత్తర్ప్రదేశ్, చత్తీస్గఢ్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇప్పటిదాకా మధ్యప్రదేశ్కు ఆక్సిజన్ అందిస్తున్న రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆయా రాష్ట్రాలు ఎగుమతులు తగ్గించడంతో ఆక్సిజన్ లేక చాలామంది పేషంట్లు ప్రాణాలు కోల్పోతున్నారని చెబుతున్నారు.













