పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం….
భారత ప్రభుత్వం 2022 ఏడాదికిగాను పద్మ అవార్డులకు నామినేషన్లు, సిఫారసుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను అందజేసేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నామినేషన్లకు స్వీకరించేందుకు తుది గడువును సెప్టెంబర్ 15గా కేంద్రం తాజాగా ప్రకటించింది. నిర్దేశిత ఫార్మాట్లో ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు హొంమంత్రిత్వ శాఖ వెబ్సైట్లో పొందుపర్చినట్టు పేర్కొంది. పద్మ అవార్డులను ప్రజల పద్మగా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ నేపథ్యలో మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు, సమాజానికి నిస్వార్త సేవ చేస్తున్న వారిని గుర్తించి సిఫారసు చేయాలని కేంద్రం కోరింది. వారి ప్రతిభ, విజయాల ఆదారంగా, కళలు, క్రీడలు, సంఘసేవ, విద్య, వైద్య, విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక, పరిశ్రమలు, వ్యాపార రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి పద్మ అవార్డులు అందజేస్తున్నామని తెలిపింది.
ఆసక్తి, అర్హత గలవారు వచ్చే నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేయాలని ప్రకటించింది. కాగా ఇప్పటికే క్షేత్రస్థాయిలో అసాధారణ కృషి చేస్తున్న విశిష్ట వ్యక్తులను పీపుల్స్ అవార్డుకు నామినేట్ చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే (జులై 11న) దేశ ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.













