ఢిల్లీ బాంబు పేలుడు మా పనే
దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో ఐఈడీ దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఇక దీని వెనక ఉగ్రవాద గ్రూపుల హస్తం ఉంటుందని భావిస్తోన్న నేపథ్యంలో దాడి చేసింది తామే అంటూ జైష్ ఉల్ హింద్ అనే ఉగ్రవాద సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసింది. అయితే ఇప్పటి వరకు ఈ సంస్థ పేరు ఎప్పుడు, ఎక్కడా వినలేదని, తెలియదని అధికారులు వెల్లడించారు. టెలిగ్రామ్ వేదికగా చేసిన ఈ ప్రకటనకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. అయితే దర్యాప్తు సంస్థలు కేవలం ఈ ప్రకటన మీద మాత్రమే ఆధారపడకూడదని భావిస్తున్నాయి. సరైన ఆధారాలు లభించేతవరకు దాడి చేసింది జైష్ ఉల్ హింద్ సంస్థ అని నమ్మడం సమంజసం కాదని అభిప్రాయపడుతున్నాయి.
దర్యాప్తును తప్పదోవ పట్టించే ప్రయత్నం కూడా అయ్యి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ప్రస్తుతం వైరలవుతోన్న స్క్రీన్ షాట్లలో సర్వశక్తివంతుడైన అల్లా దయ, సాయంతో జైష్ ఉల్ హింద్ సైనికులు ఢిల్లీలోని అత్యంత కట్టుదిట్టమైన నిఘా ఉన్న ప్రాంతంలోకి చొచ్చుకుని వెళ్లి.. ఐఈడీ దాడి చేశారు. భారతదేశం చేసిన దాడులకు ప్రతీకారంర అల్లా ఆజ్ఞతో మొదలైన ఈ దాడులు కొనసాగుతాయి. ముఖ్యమైన భారతదేశ నగారాలను లక్ష్యంగా చేసుకుని ఈ తరహా దాడులు చేస్తాం. వేచి ఉండండి అని ఉంది. ఇక ఢిల్లీలో గణతంత్ర దినోత్సవం ముగింపు వేడుకలు జరిగిన ప్రదేశానికి సమీపంలో సుమారు 50 మీటర్ల దూరంలో అబ్బుల్ కలాం రోడ్డులో ఈ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే.













