కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు

పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో 26 వేల మంది టీచర్ల ఉద్యోగాలు రద్దు చేసిన కలకత్తా హైకోర్టు మరో సంచలన తీర్పు వెలువరించింది. ఓబీసీలో పలు క్లాసులను కొట్టివేసింది. 2010 తర్వాత నుంచి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఓబీసీ ధ్రువపత్రాలను రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. 2012 నాటి పశ్చిమబెంగాల్ వెనకబడిన వర్గాల చట్టంలోని కొన్ని నిబంధనలు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన ధ్విసభ్య ధర్మాసనం 2010`12 మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణలుగా పేర్కొన్న 42 క్లాసులను కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది. ఆ వర్గీకరణలు చట్టవిరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది.
అందువల్ల 2010 తర్వాత ఈ క్లాసుల కింద జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లన్నింటిని రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. 1993 నాటి వెనకబడిన వర్గాల చట్టానికి అనుగుణంగా కొత్త ఓబీసీ జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. అయితే, ఈ క్లాసులతో జారీ అయిన ఓబీసీ ధ్రువపత్రాలతో ఇప్పటికే ప్రయోజనాలు పొందుతున్నవారు ఆ రిజర్వేషన్ల కింద ఉద్యోగాలు చేస్తున్న వారిపై ఈ తీర్పు ఎలాంటి ప్రభావం చూపదని న్యాయస్థానం వెల్లడిరచింది.